హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుకు మరో కష్టం ఎదురైంది. తాజాగా ఆయన చికెన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఎన్నో వివాదాలతో ఆయనతోపాటు, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఈ చికెన్ వివాదం బయటికి రావడంతో మరోసారి ఆ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. దీంతో ఈ నాటుకోడి చికెన్ ఘటన సీఎం సుఖుకు కొత్త తలనొప్పిగా మారింది. అయితే తాజాగా ముఖ్యమంత్రి సుఖ్విందర్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో నాటుకోడి చికెన్ వడ్డించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో అదే ఆసరాగా తీసుకున్న ప్రతిపక్ష బీజేపీ.. సీఎంపై, కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర విమర్శల దాడికి దిగింది.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగు సుఖుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విందులో నాటుకోడి చికెన్ను కూడా వడ్డించారు. అయితే ఆ కార్యక్రమంలో నాటుకోడి చికెన్ వడ్డించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సీఎం సుఖు ఆ వైల్డ్ చికెన్ను తినకపోయినప్పటికీ హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సహా అక్కడ ఉన్న మిగితా వారికి నిర్వాహకులు వడ్డించారు.
అయితే నాటుకోడి చికెన్ను.. మెనూలో చేర్చడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జంతు సంరక్షణ సంస్థ.. ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ఇక 1972 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రక్షించాల్సిన జాతుల లిస్ట్లో నాటుకోడి కూడా ఉంది. దీంతో ఈ నాటుకోడిని వేటాడటం చట్టపరంగా నేరం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రితోపాటు ఆ కార్యక్రమానికి హాజరైన నేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి సుఖ్విందర్ క్షమాపణలు చెప్పాలని.. బీజేపీ డిమాండ్ చేస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.
ఇక నాటుకోడి చికెన్ వ్యవహారం హిమాచల్ ప్రదేశ్లో తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సుఖు స్పందించారు. తాను పాల్గొన్న ఆ కార్యక్రమంలో తనకు కొందరు నాటుకోడి చికెన్ను వడ్డించిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. కానీ తాను దాన్ని తినలేదని స్పష్టం చేశారు. అయితే కొన్ని మీడియా ఛానెళ్లు మాత్రం తాను ఆ నాటుకోడి చికెన్ను తిన్నానని ప్రసారం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇక పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనశైలిలో నాన్వెజ్ ఫుడ్ అనేది ఒక భాగమని ఈ సందర్భంగా సీఎం సుఖు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa