ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొన్న అతుల్ సుభాష్, నేడు పోలీస్ కానిస్టేబుల్.. భార్య, మామల వేధింపులతో రైలుకింద పడి మరీ

national |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 07:54 PM

ఇటీవలే బెంగళూరుకు చెందిన ఓ టెకీ.. భార్య, అత్తా, మామల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 24 పేజీల సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఈ కేసు తరహాలోనే మరో కేసు నమోదు అయింది. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. అందులో తన భార్య, మామల వేధింపులు తట్టుకోలేకే ప్రాణాలు తీసుకుంటున్నట్లు రాసుకొచ్చాడు. ఆ తర్వాత రైలు కింద పడి మరీ బలవన్మరణం చెందాడు. ఈ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఉత్తర కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని హండిగనూరు గ్రామానికి చెందిన 33 ఏళ్ల తిప్పన్న.. బెంగళూరులోని హులిమావు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అయితే మూడేళ్ల క్రితమే ఆయనకు స్వగ్రామానికి చెందిన పార్వతితో వివాహం జరిగింది. ప్రస్తుతం బెంగళూరు ఎలక్ర్టానిక్ సిటీలోని ఓ ఇంట్లో భార్యతో పాటు అద్దెకు జీవిస్తున్నాడు. అయితే వారికి ఇంకా పిల్లలు పుట్టలేదు. పెళ్లైన నాటి నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండానే జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు.


ఉదయం షిఫ్టులో భాగంగా శనివారం (డిసెంబర్ 14) నాడు ఎప్పటిలాగే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విధులు నిర్వర్తించాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య పార్వతితో మళ్లీ గొడవ ప్రారంభం అయింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగగా.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే విషయం భార్య పార్వతి తన తండ్రికి చెప్పగా.. ఆయన తిప్పన్నకు ఫోన్ చేసి దుర్భషలాడాడు. తీవ్ర మనోవేదనకు గురైన తిప్పన్న వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.


అనుకున్నదే తడవుగా హీలలిగె రైల్వే స్టేషన్ కార్మెలారం రైల్వేగేట్ మధ్య పట్టాలపైకి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయింది తిప్పన్న అని గుర్తించారు. అక్కడే ఉన్న ఆయన చేతన్‌తో పాటు ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అది చదివి షాక్ అయ్యారు.


సూసైడ్ నోట్‌లో ఏముందంటే.. " నా భార్య పార్వతి, ఆమె తండ్రి యమునప్ప వేధింపులు తాళలేకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. డిసెంబర్ 12వ తేదీన యమునప్ప నాకు రాత్రి 7.26 గంటలకు ఫోన్ చేసి 14 నిమిషాలు మాట్లాడి విపరీతంగా తిట్టాడు. నన్ను చనిపోవాలని లేకపోతే తన కూతురు ప్రశాంతంగా ఉండలేదని అన్నాడు. ఆపై నేను చనిపోకపోతే ఆయనే చంపేస్తానంటూ బెదిరించాడు" అని తిప్పన్న తెలిపారు.


తిప్పన్న మృతి విషయం తెలుసుకున్న ఆయన తల్లి బసమ్మ కన్నీరుమున్నీరు అయింది. తన కుమారుడి మృతికి కారణం అయిన కోడలు పార్వతి, ఆయన అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలే టెకీ ఆత్మహత్య సంచలనం సృష్టించగా ఈ కేసును కూడా పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa