దేశంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఏటా లక్షల మంది దుర్మరణం పాలవుతున్నారు. అజాగ్రత్త, నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం మత్తు సహా అనేక కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో గత ఐదేళ్లకు సంబంధించి రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్యకు సంబంధించిన జాబితాను తాజాగా కేంద్రం విడుదల చేసింది. 2018 నుంచి 2022 వరకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో నమోదైన రోడ్డు ప్రమాదాల మృతులకు సంబంధించిన గణాంకాలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం 7.77 లక్షల మంది దేశవ్యాప్తంగా చనిపోయినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ఒక్క 2022 ఏడాదిలోనే దేశంలో 1,68,491 మంది మరణించినట్లు ఆ నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఏడాది అంటే 2021లో 1,53,972 మంది చనిపోయారు. ఇక లిస్ట్లోని టాప్-10 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నాయి. గత ఐదేళ్లలో దేశంలోని ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారు ఉన్నారని కేంద్రం తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను తయారు చేసినట్లు వెల్లడించింది.
ఇక రాష్ట్రాల విషయానికి వస్తే.. 2022లో ఒక్క ఉత్తర్ప్రదేశ్లోనే అత్యధికంగా 22,595 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినట్లు తెలిపింది ఆ తర్వాత తమిళనాడులో 17,884.. మహారాష్ట్రలో 15,224 మంది చనిపోయినట్లు ఆ నివేదికలో వివరించింది. ఇక ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం.. అతివేగం, సెల్ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవర్లు క్రమశిక్షణ లేకుండా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదాలు జరిగినట్లు కేంద్రం గుర్తించింది.
2018-2022 మధ్య దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు సంభవించిన టాప్-10 రాష్ట్రాలు:
ఉత్తర్ప్రదేశ్ - 1,08,882 మరణాలు
తమిళనాడు - 84,316 మరణాలు
మహారాష్ట్ర - 66,370 మరణాలు
మధ్యప్రదేశ్ - 58,580 మరణాలు
కర్ణాటక - 53,448 మరణాలు
రాజస్థాన్ - 51,280 మరణాలు
ఆంధ్రప్రదేశ్ - 39,058 మరణాలు
బీహార్ - 36,191 మరణాలు
తెలంగాణ - 35,565 మరణాలు
గుజరాత్ - 36,626 మరణాలు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa