భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో లోక్సభలో ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఈ క్రమంలోనే రాజ్యాంగం గురించి సభ్యులు వివిధ రకాల ప్రసంగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతూనే మహాభారతంలోని ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడి కథను రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఈ కథ చెబుతూ రాహుల్ గాంధీ పొరపాటుగా అన్న కొన్ని పదాలతో బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ కూటమి ఎంపీలు ఒక్కసారిగా నవ్వులతో సభను దద్దరిల్లేలా చేశారు.
దేశంలో ప్రస్తుతం యుద్ధం జరుగుతోందని పేర్కొన్న రాహుల్ గాంధీ.. ఈ క్రమంలోనే మహా భారత యుద్ధంలోని ద్రోణాచార్యుడి కథను సభలో వినిపించారు. ద్రోణాచార్యుడికి.. ఏకలవ్యుడు తన బొటన వేలిని గురుదక్షిణగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అదానీకి ముంబైలోని ధారావి ప్రాజెక్టును అప్పగించినప్పుడే.. అక్కడ ఉన్న చిన్న, మధ్య తరహా వ్యాపారుల బొటనవేళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసేసినట్లు అయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో అనేకమంది యువత పరిస్థితి కూడా అప్పుడు ఏకలవ్యుడికి వచ్చిన పరిస్థితే వచ్చిందని రాహుల్ గాంధీ తెలిపారు. ఏకలవ్యుడి లాగానే వేలాదిమంది యువకులు కష్టపడి విద్య నేర్చుకుంటున్నారని.. కానీ పేపర్ లీకేజీలతో యువత కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతోందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడి కథను గుర్తు చేసిన రాహుల్ గాంధీ.. 6, 7 ఏళ్ల యువకులు అని పేర్కొన్నారు. అయితే 6, 7 ఏళ్ల వయసు ఉన్న వారిని బాలురు అనకుండా యువకులు అనడం పట్ల సభలో ఉన్న అధికార కూటమి ఎంపీలు ఒక్కసారిగా నవ్వారు. అయితే వెంటనే గుర్తించిన రాహుల్ గాంధీ.. యువకులు అంటూ తన మాటను సరిచేసుకున్నారు. అంతేకాకుండా తాజాగా కనీస మద్దతు ధర అడిగిన రైతులపై బాష్పవాయువు ప్రయోగించారు ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా కులగణన చేపడతామని మరోసారి స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే రాజ్యాంగంపై హిందుత్వ సిద్ధాంత కర్త వీడీ సావర్కర్ గతంలో చేసిన వ్యాఖ్యలను లోక్సభలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం, మనుస్మృతి మధ్య తేడాలను వివరించారు. మనుస్మృతి సిద్ధాంతాలను అనుసరించి రాజ్యాంగం ఉండాలని వీడీ సావర్కర్ పేర్కొన్నారని.. కానీ రాజ్యాంగంలో అంబేద్కర్, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూల ఆలోచనలు, వారి మాటలు వినిపిస్తాయని తెలిపారు. రాజ్యాంగం అనేది ఆధునిక భారతదేశానికి సంబంధించిన ఓ డాక్యుమెంట్ అని.. కానీ ప్రాచీన భారత విలువలు కూడా అందులో ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని సావర్కర్ విమర్శిస్తే.. ప్రస్తుత బీజేపీ రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతోందని విమర్శించారు. "మీ ఆత్మబంధువును అవహేళన చేసినట్లు అనిపించడం లేదా’’ అని బీజేపీకి రాహుల్ గాంధీ చురకలు అంటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa