ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెలకు రూ. 2 కోట్ల అద్దె.. రూ. 12 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బిగ్ డీల్

business |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 09:46 PM

ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు.. సంస్థలు.. పెద్ద పెద్ద ఆఫీసుల్ని తెరుస్తున్నాయి. కొత్త ప్రాంతాల్లో తమ వ్యాపారాల్ని విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇక ఇప్పుడు భారత్‌లోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు.. హెచ్‌డీఎఫ్‌సీ బిగ్ డీల్ చేసుకుంది. నవీ ముంబైలో పెద్ద మొత్తంలో ఆఫీస్ స్పేస్ (కార్యాలయ స్థలం) లీజుకు తీసుకుంది. మైండ్ స్పేస్ ఐరోలి వెస్ట్ ప్రాంతంలోని కమర్షియల్ కాంప్లెక్స్ ఇప్పుడు అద్దెకు తీసుకుందని తెలుస్తోంది. ఇది మొత్తం 8 అంతస్తులో సుమారు 4 లక్షల చదరపు అడుగులకుపైగా విస్తరించి ఉంది. ఇది లాంగ్ టర్మ్ లీజు కూడా. అంటే మొత్తం 10 సంవత్సరాల కాలానికి లీజుకు ఒప్పందం కుదిరిందని ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు వెల్లడించారు.


మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఇఐటీ అనే లిస్టెడ్ యజమానికి.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు మధ్య ఈ ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఇందులో భాగంగా మొత్తం పదేళ్ల కాలానికి అద్దె రూ. 320 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ప్రతి మూడేళ్లకు ఒకసారి అద్దె పెరిగేలా డీల్ కుదిరింది. ఇదంతా కలిపే రూ. 320 కోట్లు అవుతుంది. బ్యాంక్.. సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇప్పటికే రూ. 12.23 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.


ఈ లీజుకు తీసుకున్న స్థలంలో ఇప్పుడు బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌‌తో పాటు 8 అప్పర్ ఫ్లోర్స్ ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ తన కార్యకలాపాల విస్తరణకు ఇది మంచి ప్రదేశం అని భావిస్తోంది. నవంబర్ 13న ఈ అగ్రిమెంట్ కుదిరినట్లు రియాల్టీ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌స్టాక్.. సదరు డాక్యుమెంట్లను చూయించింది. జనవరి 1 నుంచి ఈ డీల్ అమల్లోకి వస్తుందని తెలిసింది.


మొత్తం ఆఫీస్ స్పేస్ 4.16 లక్షల చదరపు అడుగులు. ఇక్కడ వార్షిక ప్రాతిపదికన అంటే ఏడాదికి అద్దె రూ. 24 కోట్లుగా ఉంది. ఇక నెలకు ఇది రూ. 2 కోట్ల వరకు ఉండనుంది. ఈ లెక్కన చదరపు అడుగుకు రూ. 49 చొప్పున పడుతుందన్నమాట. మొత్తం రెండు డీల్స్ జరిగినట్లు సమాచారం. ఒకటేమో 1,97,877 చదరపు అడుగులకు కాగా.. మరొకటి 2,18,217 చదరపు అడుగులకు ఒప్పందం కుదిరింది. మొత్తం ఈ లీజు కింద 322 కార్లను పార్కింగ్ చేసుకునేందుకు స్థలం ఉంది.


ఇక కొద్ది రోజులుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ దూసుకెళ్తోంది. ఇటీవలే రూ. 1880 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకగా.. ప్రస్తుతం (డిసెంబర్ 14న) రూ. 1873.30 గా ఉంది. మార్కెట్ విలువ రూ. 14.31 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల కనిష్ట ధర రూ. 1363.55 గా ఉంది. నెల వ్యవధిలో ఈ స్టాక్ ధర 10 శాతానికిపైగా పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa