ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్త ఫిషింగ్ హార్బర్.. సాగరమాల 2 కింద కేంద్రం నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 06:08 PM

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఏపీలో కొత్తగా ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సాగరమాల 2.0 కార్యక్రమం కింద ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం 40 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా. రూ.400 కోట్ల వ్యయంతో కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ రూపుదిద్దుకోనుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఇప్పటికే ఐదుచోట్ల ఫిషింగ్ హార్బర్లు నిర్మాణ దశల్లో ఉన్నాయి.


ప్రకాశం జిల్లాలోని మత్స్యకారులకు ఇది భారీ శుభవార్త అని చెప్పాలి. అదే విధంగా కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం 40 ఎకరాల భూమిని గుర్తించాలని జిల్లా అధికారులను కూడా ఆదేశించింది. 400 కోట్ల రూపాయలతో నిర్మించే కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ద్వారా సుమారుగా 15000 మంద మత్స్యకార కుటుంబాలకు లభ్ధి కలుగుతుందని అంచనా. మరోవైపు ఫిషింగ్ హార్బర్‌లో కోల్డ్ చైన్ వ్యవస్థ, రోడ్లు, యాంకరింగ్ సౌకర్యాలు ఇలా మత్స్యకారులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ కోసం స్థానికంగా చాలా కాలం నుంచి డిమాండ్లు ఉన్నాయి. సుమారుగా పదేళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


మరోవైపు స్థానికంగా వస్తున్న డిమాండ్లతో సాగమాల -1 ప్రాజెక్టులో భాగంగా కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని కేంద్రం భావించింది. అయితే భూసేకరణలో సాంకేతిక కారణాలతో అప్పట్లో అడుగు ముందుకు పడలేదు. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కోసం 40 ఎకరాల భూమి అవసరమని కేంద్రం చెప్తోంది. అయితే 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కేవలం 10 ఎకరాల భూమిని మాత్రమే గుర్తించగలిగింది. ఆ తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ మీద దృష్టిసారించలేదు. నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లకు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో స్థానికుల డిమాండ్ అలాగే ఉండిపోయింది.


అయితే 2024 ఎన్నికల్లో గెలిచి టీడీపీ తిరిగి అధికారంలోకి రావటంతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. ఇదే సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత దామచర్ల సత్య ఏపీ మారీటైమ్ బోర్డు ఛైర్మన్ కావటం కూడా కలిసొచ్చింది. ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన దామచర్ల సత్య కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్‌ను కలిసి కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ గురించి చర్చించారు. అనంతరం అధికారులతో చర్చించిన కేంద్ర మంత్రి.. సాగరమాల 2 ప్రాజెక్టు కింద కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అందుకు అవసరమైన భూమిని ప్రభుత్వం సేకరించాలని సూచించారు. దీంతో 40 ఎకరాల భూమిని గుర్తించాలంటూ ప్రకాశం జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa