ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. రూ.1000 కోట్లతో కొత్త పథకం, పంట కోసిన తర్వాత కూడా

national |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 06:41 PM

దేశంలో రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు సులువుగా రుణాలు ఇచ్చేందుకు మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. క్రెడిట్ గ్యారెంటీ పథకం కింద.. రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం ప్రకటించారు. ఈ క్రెడిట్ గ్యారెంటీ పథకం కింద పంట కోసిన తర్వాత ఎలక్ట్రానిక్ గిడ్డంగి రసీదుల ద్వారా ఈ లోన్లు పొందవచ్చని పేర్కొన్నారు. వేర్‌‌హౌసింగ్ డెవలప్‌‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ- డబ్ల్యుడీఆర్‌‌ఏ రిజిస్టర్డ్ రిపోజిటరీలు జారీ చేసిన ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్‌‌హౌస్ రసీదులకు ఈ-ఎన్‌‌డబ్ల్యుఆర్‌‌లు బ్యాంకులు.. రైతులకు రుణాలు అందించడమే ఈ క్రెడిట్ గ్యారెంటీ పథకం లక్ష్యమని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.


రైతుల కోసం తీసుకువచ్చిన క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్(రుణ హామీ పథకం)ను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం ప్రకటించారు. పంట కోసిన తర్వాత దాని మీద రైతులకు లోన్లు ఇచ్చేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలోనే క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ కోసం రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. అయితే ఈ లోన్లు తీసుకునేందుకు రైతులు సంబంధిత పత్రాలను తప్పనిసరిగా బ్యాంకుల్లో తనఖా కింద ఉంచి.. డబ్బులు తీసుకోవచ్చని వెల్లడించారు. ఈ రుణ హామీ పథకం కింద.. ఎలక్ట్రానిక్ గిడ్డంగులకు సంబంధించిన రసీదులను సమర్పించి రైతులు పంట అనంతర రుణాలను సులభంగా పొందవచ్చని తెలిపారు.


రైతులు తమ పంట ఉత్పత్తులను ఉంచిన తర్వాత.. వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యుడీఆర్‌ఎ) రిజిస్టర్డ్ రిపోజిటరీలు ఇచ్చే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్‌హౌస్ రిసిప్ట్‌ (ఈ-ఎన్‌డబ్ల్యుఆర్‌)లను బ్యాంకులకు అందించడం ద్వారా లోన్లు పొందవచ్చని తెలిపారు. అయితే ఈ ఈ-ఎన్‌డబ్ల్యుఆర్‌లను తీసుకుని.. బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడం అనేది ఉండకుండా చూసుకోవడమే ఈ పథకం లక్ష్యమని వివరించారు. ఈ-ఎన్‌డబ్ల్యుఆర్‌లను తీసుకుని సంబంధిత బ్యాంకులు సకాలంలో రైతులకు రుణాలు అందించనున్నాయని పేర్కొన్నారు. బ్యాంకులు ఉదారవాద విధానాలతో రైతులకు రుణాలు ఇచ్చేలే ప్రోత్సహించడమే ఈ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ లక్ష్యమని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.


ప్రస్తుతం రైతులు తీసుకుంటున్న లోన్లలో పంట కోసిన తర్వాత తీసుకునే లోన్లు చాలా తక్కువ అని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. దేశంలో రైతులు తీసుకున్న మొత్తం వ్యవసాయ రుణాలు రూ. 21 లక్షల కోట్లు అయితే.. అందులో పంట అనంతర రుణాలు కేవలం రూ. 40 వేల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం, ఈ-ఎన్‌డబ్ల్యుఆర్‌లపై తీసుకున్న లోన్లు కేవలం రూ.4వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక రానున్న 10 ఏళ్లలో పంట అనంతర రుణాలు రూ. 5.5 లక్షల కోట్లకు పెరుగుతాయని ఆశిస్తున్నట్లు సంజీవ్ చోప్రా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa