ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త ఏడాదిలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. ఆ మహిళా నేత సహా రేసులో ప్రముఖుల పేర్లు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 06:42 PM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారసులు ఎవరా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఇప్పటికే జేపీ నడ్డా పదవీకాలం పూర్తయినా.. ఎన్నికల హడావుడిలో భాగంగా దాన్ని పొడిగిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కొత్త ఏడాదిలోనే కొత్త అధ్యక్షుడు బీజేపీ పగ్గాలు చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. ఈ ఎంపిక వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా పూర్తి అవుతుందని కాషాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ చీఫ్ రేసులో ఓ మహిళా నేతతోపాటు పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.


గతంలో బీజేపీ చీఫ్‌గా ఉన్న అమిత్ షా తర్వాత 2020లో జగత్ ప్రకాష్ నడ్డా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో తిరిగి ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారింలోకి రావడంతో.. జేపీ నడ్డాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రమంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్ష పదవితోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగానూ జేపీ నడ్డా ఉన్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవీకాలం 3 సంవత్సరాలే కాగా.. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు.


ఇక జేపీ నడ్డా తర్వాత బీజేపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారు అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీలో ఉన్న వారిని తీసుకుంటారా లేక ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నవారికి ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తారా అనేది ఇప్పుడు కమలం పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక తెరపైకి బీజేపీ సీనియర్ నేతల పేర్లు వస్తున్నాయి. బీజేపీ సీనియర్ నాయకురాలు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే పేరు వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా బీజేపీ జనరల్ సెక్రటరీలు వినోద్ తావ్డే, సునీల్ బన్సల్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.


బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఒక ప్రక్రియ ఆధారంగా జరుగుతుంది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతున్నాయని కమలం పార్టీ వర్గాలు వెల్లడించాయి. సగానికి పైగా రాష్ట్ర యూనిట్లలో పోలింగ్‌ ప్రక్రియ జనవరి మధ్య నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీంతో ఫిబ్రవరి నెలాఖరు నాటికి జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని కాషాయ వర్గాలు తెలిపాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa