బొబ్బి లి రూరల్ పోలీసు సర్కిల్ పరిధిలోని తెర్లాం మండలం డి.గదబవలస జంక్షన్లో గంజాయి తరలిస్తున్న రెండు కార్లను పట్టుకున్నామని డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా నుంచి అక్రమంగా రెండు వాహనాల్లో గంజాయి వస్తున్నట్టు అందిన సమాచారంతో రూరల్ సీఐ నారాయణరావు, రామభద్రపురం, బాడంగి ఎస్ఐలు ప్రసాద్, తారకేశ్వరరావు, పీసీలు విష్ణు, పృధ్వీ తదితరులతో నిఘా పెట్టారు.
రామభద్రపురం నుంచి రాజాం హైవేలో తనిఖీలు చేపట్టగా తెర్లాం డి.గదబవలస జంక్షన్లో గంజాయి తరస్తున్న రెండు కార్లను గుర్తించారు. మొదట ఆ కార్లలో ఎటువంటి గంజాయి లభ్యం కాలేదు. ఆ తర్వాత క్షుణ్ణంగా సోదా చేసి, కార్ల బానెట్లో గంజాయిని గుర్తించారు. ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా పొందేల్ గ్రామానికి చెందిన చందన్ అడ్కటియా, హర్యానా రాష్ట్రం పాలవాల్ జిల్లా గోధి గ్రామానికి చెందిన వీరేంద్ర సింగ్, అదే రాష్ట్రం పరిదాబాద్కు చెందిన సునీల్ రాణాలను అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని రిమాండ్ తరలించారు. వీరితో పాటు ఒక మైనర్ కూడా ఉన్నాడు. అలాగే ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా ఘటిగూడ గ్రామానికి చెందిన కృష్ణపాంగి, సునీల్ అడ్కటియాతో పాటు హర్యానాకు చెందిన బన్వారీ అనే ముగ్గురు పరారయ్యారు. నిందితుల నుంచి 15 ప్యాకెట్లు (18.2 కిలోల గంజాయి), రెండు కార్లు, రూ.12 వేలు నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు విష్ణు, పృధ్వీలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa