ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాజకీయాలపై ఓ పుస్తకం రాస్తే.. అందులోని ప్రతి పేజీలో కనిపించే పేరు చంద్రబాబు. 40 ఏళ్లకుపైగా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఆయనను.. రాజకీయాన్ని వేరుచేసి చూడలేం. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా ఆయన ప్రతీ నిర్ణయం వెనుక ఓ విజన్ ఉంటుంది. చంద్రబాబు విజన్ గురించి ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఆయన దార్శనికత కారణంగా సాధించిన విజయాలను అంగీకరించక తప్పని పరిస్థితి. నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన చంద్రబాబు.. ఈ సారి పాత తప్పులను పునరావృతం కానివ్వకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
చీఫ్ మినిస్టర్ ఫెలోస్ పేరుతో ఓ కొత్త కార్యక్రమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుబంధంగా ఈ చీఫ్ మినిస్టర్ ఫెలోస్ బృందం పనిచేయనున్నట్లు సమాచారం. చీఫ్ మినిస్టర్ ఫెలోస్ టీమ్లోకి యువతను తీసుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక సంస్థలో చదువుకున్న పాతిక మంది ప్రతిభావంతులైన యువతను ఈ చీఫ్ మినిస్టర్ ఫెలోస్ టీమ్లోకి తీసుకోనున్నట్లు తెలిసింది. వీరికి మంచి జీతాలు కూడా ఇవ్వనున్నారు. వివిద అంశాలపై శిక్షణ ఇచ్చిన తర్వాత వీరికి జిల్లాల బాధ్యతలు అప్పగిస్తారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ నుంచి ఈ చీఫ్ మినిస్టర్ ఫెలోస్ కార్యరూపం దాల్చనున్నట్లు సమాచారం.
చీఫ్ మినిస్టర్ ఫెలోస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి అమల్లోని లోటుపాట్లు, పాలనలో సమస్యలు, వాటికి పరిష్కారాలు, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు ఇలాంటి అంశాలపై ఈ టీమ్ సభ్యులు పనిచేస్తారు. ఈ అంశాలపై అధ్యయనం జరుపుతూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో జరిగే సమాచారాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేరవేయటం ఈ చీఫ్ మినిస్టర్ ఫెలోస్ టీమ్ ముఖ్య ఉద్దేశం. అలాగే ఉన్నత విద్యావంతులు కావటంతో వివిధ సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ పాలనలోనూ సహాయకారిగా చీఫ్ మినిస్టర్ ఫెలోస్ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారట.
మరోవైపు ఇలాంటి బృందాలను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు నియమించుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం కోసం ఐఐఎం అహ్మదాబాద్ అప్పట్లో ఇలాంటి బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో ఈ బృందాల పనితీరు ఎలా ఉంది, ఏమైనా మార్పులు చేయాలా వంటి అంశాలను పరిశీలించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విజన్ డాక్యుమెంట్ కల సాకారం కోసం ఏమేం చేయాలనే దానిపై ఫోకస్ పెట్టారు. ఈ విషయంలోనూ చీఫ్ మినిస్టర్ ఫెలోస్ టీమ్ సహకరిస్తుందని భావిస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa