భాషాభిమానులు, కవులు, రచయితలు, మేధావులు కోరుతున్నట్టుగా రాష్ట్రంలో అన్ని విద్యాలయాల్లోనూ ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు మాధ్యమం అమలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. విజయవాడలో రెండు రోజులపాటు నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ముగింపు సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాజమహేంద్రవరంలోని బేతిని గ్రంథాలయం, విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయం మన భాషా వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పాటును అందించాయని, వాటిని సాహితీ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే నేటితరం పిల్లలకు భాషపై ఆసక్తి పెరుగుతుందని తెలిపారు.
ఎకో టూరిజం, వైల్డ్లైఫ్ టూరిజంతో పాటు సాహితీ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాలు మాతృభాషకు ఇస్తున్న ప్రాధాన్యం మనం ఇవ్వలేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భాషను పరిరక్షించడానికి ప్రభుత్వాలే కాకుండా పౌరసమాజం తగిన పాత్ర పోషించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో మునిగిపోతున్న విద్యార్థులను పుస్తక పఠనం వైపు మళ్లించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. మాతృభాషను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.మహాసభల్లో ఆమోదించిన తీర్మానాలతో పాటు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవడంతో తెలుగు భాష ఔన్నత్యాన్ని కోల్పోతోందన్నారు. అమృత భాషగా భావించే తెలుగుకు వైసీపీ తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాష వికాసాన్ని నాశనం చేశారని ఆరోపించారు. మాతృభాషకు, పరాయి భాషకు తల్లిపాలు తాగి ఎదిగిన బిడ్డకు, పోత పాలు తాగి పెరిగిన బిడ్డకు ఉన్నంత వ్యత్యాసం ఉంటుందని వ్యాఖ్యానించారు. మాతృభాషలో విద్యా బోధన జరిగినప్పుడు విద్యార్థుల్లో సంపూర్ణ మానసిక వికాసం పెంపొందుతుందని తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తే తెలుగు భాష పరిస్థితి ఏమిటని మంత్రి దుర్గేష్ ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa