ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో మరో కొత్త వైరస్ విజృంభణ.. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ

international |  Suryaa Desk  | Published : Fri, Jan 03, 2025, 08:53 PM

కరోనా మహమ్మారికి పుట్టిల్లు చైనాలో మరో వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. సరిగ్గా కోవిడ్-19 వెలుగులోకి వచ్చిన ఐదేళ్ల తర్వాత కొత్తరకం వైరస్ పుట్టుకురావడం ఆందోళనకు గురిచేస్తోంది. చైనాలో హ్యూమన్‌ మెటానిమోవైరస్‌  వేగంగా వ్యాప్తి చెందుతోందని, దీని బారినపడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా నిమోనియా, కోవిడ్-19 వైరస్‌లు కూడా విజృంభిస్తున్నట్టు వీడియోలను షేర్ చేస్తున్నారు.


అంతేకాదు, దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నప్పటికీ.. దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. హ్యూమన్ మోటానిమోవైరస్ బారినపడ్డవారిలో కోవిడ్ తరహా లక్షణాలే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తిని చైనా ఆరోగ్యశాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ‘‘ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా నిమోనియా, కోవిడ్-19 సహా పలు వైరస్‌లు చైనాలో వేగంగా వ్యాప్తిచెందుతున్నాయి..దీంతో బాధితులతో ఆసుపత్రులు, చనిపోయినవారితో శ్మశానాలు నిండిపోతున్నాయి.. పిల్లల ఆసుపత్రులు ముఖ్యంగా పెరుగుతున్న న్యుమోనియా, వైట్ లంగ్ కేసులతో ఒత్తిడికి గురవుతున్నాయి’ అని ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.


కాగా, ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక విడుదల చేసింది. శీతాకాలంలో కొన్ని శ్వాసకోశ వ్యాధులు పెరగడంతో గుర్తు తెలియని న్యుమోనియా తరహా ఓ వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా డిసీజ్ కంట్రోల్ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించినట్టు అందులో పేర్కొంది.


ఐదేళ్ల కిందట 2019 డిసెంబరులో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేలా తొలినాళ్లలో చైనా సరైన చర్యలు చేపట్టకపోవడంతో ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని డ్రాగన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వైరస్‌ కారకాలను గుర్తించడం, నిరంతరం అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనల కోసం ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ మేరకు చైనా అధికార మీడియా ‘సీసీటీవీ’ వెల్లడించింది. దీని ప్రకారం.. డిసెంబరు 16 నుంచి 22 వరకు వారం వ్యవధిలోనే అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.


వ్యాధి నియంత్రణ, నివారణ, కేసులను నిర్దారణ, వాటి నిర్వహిణకు నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ యంత్రాంగం ఒక విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. అయితే, శీతాకాలం, వసంతకాలంలో చైనాలో పలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వ్యాధులు విజృంభిస్తాయని కన్ బియో అనే ఓ అధికారి అన్నారు. గతేడాదితో పోల్చితే ఇవి చాలా తక్కువని అన్న ఆయన.. సంఖ్యను మాత్రం బయటపెట్టలేదు. అయితే, ఇటీవల బయటపడిన కేసులలో రైనోవైరస్, హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ వంటి వ్యాధికారక కారకాలు ఉన్నాయి. మెటాప్‌న్యూమోవైరస్ కేసులు 14 ఏళ్లలోపు పిల్లల్లో ముఖ్యంగా ఉత్తర ప్రావిన్సులలో పెరుగుతున్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి.


మెటాప్‌న్యూమోవైరస్‌ చికిత్సలో యాంటీ-వైరల్ డ్రగ్స్ గుడ్డిగా వినియోగించవద్దని ఇటీవల షాంఘై ఆసుపత్రి శ్వాసకోశ వ్యాధి నిపుణుడు హెచ్చరించారు. జలుబు మాదిరి లక్షణాలు ఉండే ఈ వైరస్‌కు ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాక్సిన్ లేదు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com