ఒకప్పుడు పాకిస్థాన్ చెర నుంచి విడిపోవడానికి యుద్ధమే చేసిన బంగ్లాదేశ్.. ఇప్పుడు అదే పాకిస్థాన్ స్నేహం కోసం ఉవ్విళ్లూరుతోంది. హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్.. భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఇరు దేశాల సంబంధాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నారు. మరోవైపు పాకిస్థాన్ అనుకూలంగా చర్యలు తీసుకుంటున్నారు. పాకిస్థాన్ దోస్తీ కోసం ఎంత చేయాలో, ఏమేం చేయాలో అంతా చేస్తున్నారు.
తాజాగా ఆ దేశంతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు వీసా ప్రక్రియను యూనస్ సర్కారు మరింత సులభతరం చేశారు. పాకిస్థాన్ రాయబారులు, ఉన్నతాధికారులకు వీసాలు జారీ చేసే సమయంలో ఢాకా నుంచి ప్రత్యేక క్లియరెన్స్ అవసరం ఉండేది. ఇప్పుడు ఆ క్లియరెన్స్లు ఏవీ అవసరం లేకుండా నేరుగా వీసాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్లోని బంగ్లాదేశ్ హైకమిషనర్ ఇక్బాల్ హుస్సేన్.. లాహోర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వ్యాపార వర్గాలకు వెల్లడించారు.
పాకిస్థాన్తో సత్సంబంధాల కోసం యూనస్ సర్కారు చర్యలు తీసుకుంటున్నట్లు ఇక్బాల్ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని, పెట్టుబడులను మరింతగా పెంచేందుకు ఈ తరహా నిర్ణయాలు తీసుకొంటున్నారని చెప్పుకొచ్చారు. 180 మిలియన్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్.. పాకిస్థాన్కు ముఖ్యమైన వాణిజ్య మార్కెట్గా మారుతుందని ఇక్బాల్ అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇరు దేశాలు లబ్ధి పొందవచ్చని సూచించారు.
దక్షిణాసియాలో ప్రాంతీయ సహకారం పెంపొందించేందుకు ఈ తరహా చర్యలు అవసరమని చెప్పారు. ప్రాంతీయ వాణిజ్యం, సహకారాన్ని పెంపొందించడానికి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం-సార్క్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్ ప్రాధాన్యతలు మారిపోయాయి. విదేశాంగ విధానంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం భారత్తో స్నేహపూర్వక వైఖరితో ఉండే బంగ్లాదేశ్, ఇప్పుడు శత్రువుగా భావిస్తూ పాకిస్థాన్ పంచన చేరుతోంది. ఈ క్రమంలోనే ఇరుదేశాలల మధ్య వాణిజ్య సంబంధాలను క్రమంగా పెంచుకుంటున్నాయి.
దానిలో భాగంగానే 53 ఏళ్లలో తొలిసారి గత నెల పాక్ నుంచి నేరుగా బంగ్లాకు కార్గో షిప్, సరకు రవాణా నౌకలు చేరుకున్నాయి. షేక్ హసీనా సర్కారు ఉన్న సమయంలో పాక్ నుంచి వచ్చే కార్గో షిప్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్న నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు ఆ నిబంధనను తొలగించింది యూనస్ సర్కారు. దీని వల్ల కార్గో తరలింపు సులభమైంది. అయితే సరకు రవాణా ముసుగులో ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటు గ్రూపులకు ఆయుధాలు అందొచ్చని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa