విజయనగరం జిల్లా, జామి మండల కేంద్రమైన జామిలో రెండు మద్యం దుకాణాలు, మండలంలోని భీమసింగి ఓ మద్యం దుకాణాన్ని సోమవారం సాయంత్రం తహశీల్దార్ కృష్ణలత మూసివేయించడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయంత్రం సమయంలో మద్యం దుకాణాల వద్దకు తహశీల్దార్ వెళ్లారు. ఇక్కడ బహిరంగంగా మద్యం సేవిస్తుడటం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని, రోజూ గొడవలతో ఇబ్బందిగా ఉందని పలువురు ఫిర్యాదులు చేశారని దుకాణ నిర్వాహకులకు తెలిపారు. ఈ పరిస్థితి మారాలని వారికి సూచించారు. అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ మద్యం దుకాణాలకు తాళాలు వేయించారు. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపు తహశీల్దార్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై వారు ఎస్ఈబీ అధికారులకు పిర్యాదు చేయడంతో వారు జామి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఈవిషయంపై తహశీల్దార్ కృష్ణలతను వివరణ కోరగా ఈ మద్యం దుకాణాల వద్ద బహిరంగంగా మద్యం సేవించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే పిర్యాదులు రావడంతో వారికి పలుమార్లు చెప్పామని, వారిలో మార్పు రాకపోవడంతో దుకాణాలకు తాళాలు వేయించామన్నారు. ఇదే విషయంపై పలువురు ఎస్ఈబీ అధికారులు మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తహశీల్దార్, స్థానిక పోలీసులు, ఎస్ఈబీ అధికారులకు పిర్యాదు చేయాలి కానీ ఇలా మూయించే అధికారం లేదన్నారు. దుకాణాలు మూయించే అధికారం కలెక్టర్, ఎస్ఈబీ సూపరింటెండెంట్కు మాత్రమే ఉందని వారంటున్నారు. దుకాణాలను తెరిపించి, శాంతిభద్రతల సమస్య లేకుండా పోలీసుల సహకారం తీసుకుంటామని ఎస్ఈబీ సీఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa