ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటి చుట్టూ హైవే నిర్మించిన ప్రభుత్వం

international |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 09:59 PM

సాధారణంగా రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని సేకరిస్తూ ఉంటుంది. అందుకు పరిహారం కూడా అందిస్తుంది. అయితే ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు ఉన్నా వాటిని తొలగించి.. ఎక్కువ మంది ప్రజలకు అవసరం అయ్యే రోడ్లను నిర్మిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోకపోతే.. స్థానికులు ఆందోళన చేసి ఎక్కువ డబ్బులు వచ్చేలా పోరాటం చేస్తారు. మరికొందరు తమ భూములు ఇవ్వమని మొండికేసినా.. ప్రభుత్వం బుజ్జగించి వారి నుంచి తీసుకుంటుంది. అయితే హైవే నిర్మించేందుకు ఓ వ్యక్తి ఇల్లు అడ్డుగా ఉండటంతో ప్రభుత్వం.. ఆ ఇంటిని తొలగించడానికి పరిహారంగా రూ.2 కోట్లు ఇస్తామని చెప్పింది. అయినా ఆ ఇంటి ఓనర్ అంగీకరించలేదు. చివరికి ఆ ఇంటి చుట్టూ ప్రభుత్వం రోడ్డు నిర్మించింది. దీంతో నడిరోడ్డుపై ఇల్లు ఉండటంతో ఆ వ్యక్తి అనేక అవస్థలు పడుతున్నాడు. తన సొంత ఇంటికి తాను నేరుగా వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. చైనాలో జరిగిన ఈ విచిత్ర పరిస్థితికి సంబంధించిన వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


చైనాలోని షాంఘై నగరానికి సమీపంలో ఉండే జింగ్సీ పట్టణంలో హాంగ్ పింగ్ అనే వ్యక్తికి రోడ్డు పక్కనే ఒక ఇల్లు ఉంది. అయితే ఆ మార్గంలో ఉన్న రోడ్డును వెడల్పు చేసి.. హైవే నిర్మించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే హాంగ్ పింగ్ ఇల్లు అడ్డుగా ఉండటంతో దాన్ని కూల్చేసి.. రోడ్డు నిర్మాణం చేయాలని భావించింది. అందుకోసం ఆ ఇంటికి 1.80 లక్షల పౌండ్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.2 కోట్లు పరిహారంగా ఇస్తామని స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే ఈ డబ్బు తనకు సరిపోదని.. అంతకంటే ఎక్కువ కావాలని హాంగ్ పింగ్ మెలిక పెట్టాడు. దీంతో అతడు తీసుకువచ్చిన ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించలేదు.


 దీంతో విసుగు చెందిన ప్రభుత్వం.. అతడికి పెద్ద షాక్ ఇచ్చింది. హాంగ్ పింగ్ ఇంటిని ముట్టుకోకుండా.. దానికి ఎలాంటి నష్టం కలగకుండా ఆ ఇంటి చుట్టూ హైవేను నిర్మించింది. దీంతో ఆ ఇల్లు ఇప్పుడు హైవేకు మధ్యలో ఉండిపోయింది. ప్రస్తుతం ఆ హైవే నిర్మాణం పూర్తి చేసుకుని.. వాహనాల రాకపోకలు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రతీ క్షణం వాహనాల చప్పుడుతో ఆ ఇంట్లో ఉన్నవారు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు. రాత్రి పూట కంటినిండా నిద్ర కూడా పోవడం లేదు. మరోవైపు.. ఆ ఇల్లు రోడ్డు మధ్యలో ఉండటంతో ఇంట్లోకి వెళ్లాలన్నా.. బయటికి రావాలన్నా.. హైవే నిర్మాణంలో భాగంగా నిర్మించిన ఒక టన్నెల్ లోపలి నుంచి వెళ్లాల్సిన దుస్థితి వారికి ఏర్పడింది.


అయితే ప్రభుత్వం ఇస్తానన్న రూ.2 కోట్లు తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని హాంగ్ పింగ్ ఇప్పుడు భావిస్తున్నాడు. ఆ ఇంట్లో హాంగ్ పింగ్, అతని భార్య, 11 ఏళ్ల వయసు ఉన్న అతని మనవడు నివసిస్తున్నారు. ఇక ఆ ఇంటిని చూసేందుకు పలువురు పర్యాటకులు కూడా వస్తుండటం గమనార్హం. అయితే అలా వచ్చిన టూరిస్టుల నుంచి డబ్బు వసూలు చేసి.. ఎంతో కొంత సంపాదించుకోవాలని హాంగ్ పింగ్ భావిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇక ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం తప్ప హాంగ్ పింగ్ కుటుంబానికి మరో దారి లేదని పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa