అమెరికాలో అక్రమంగా వలస పొందుతున్న 80 మంది బ్రెజీలియన్లను ఆదివారం రోజు తిరిగి స్వదేశానికి పంపించింది. అయితే బ్రెజిల్ ఉత్తర నగరమైన మనౌస్లో ఆ విమానం ల్యాండ్ కాగా.. 80 మంది బ్రెజీలియన్ పౌరులు చేతులకు సంకెళ్లతో ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. ఈక్రమంలోనే వారందరినీ ప్రశ్నించగా అమెరికా వారికి చూపించిన నరకం గురించి చెప్పి కన్నీటి పర్యంతం అయ్యారు. ముఖ్యంగా తాము విమానంలో ఎక్కడానికి ముందే తమ చేతులకు సంకెళ్లు వేసినట్లు తెలిపారు.
ఆపై విమానంలోకి వచ్చి కూర్చున్నాకా తమ కాళ్లు కూడా కట్టేశారని బ్రెజీలియన్లు వివరించారు. విమానంలో ఉండగా.. దాహం వేస్తుందని అడిగితే కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా అందించకుండా తమను ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. బాత్రూం వెళ్లాలని చెప్పినా వారు పట్టించుకోకుండా తమను అలాగే ఉంచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాగేందుకు నీళ్లు లేక బాత్రూంకు వెళ్లలేక అనేక మంది అస్వస్థతకు గురయ్యారని స్పష్టం చేశారు.
ముఖ్యంగా యూఎస్ నుంచి ఇదే విమానంలో వచ్చిన ఎడ్గార్ డా సిల్వా మౌరా అనే 31 ఏళ్ల కంప్యూటర్ టెక్నీషియన్ మాట్లాడాతూ.. బహిష్కరణకు ముందే తాను 7 నెలల పాటు అమెరికా నిర్బంధంలో ఉన్నట్లు తెలిపాడు. విమానంలో పలు సాంకేతిక సమస్యల వల్ల ఏసీలు కూడా పని చేయకపోవడంతో.. అనేక మంది మూర్చపోయారని వివరించారు.
అలాగే 21 ఏళ్ల లూయిస్ ఆంటోనియా రోడ్రిగ్స్ శాంటోస్ మాట్లాడుతూ.. ఏసీలు నాలుగు గంటలు పని చేయలేదని దీని వల్ల పలువురు శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారని చెప్పారు. తాము వచ్చిన విమానం ఆగ్నేయ నగరమైన హారిజోంటేలో ల్యాండ్ కావాల్సిందని కానీ సాంకేతిక సమస్యల కారణంగా మనౌస్లో ల్యాండ్ చేశారని స్పష్టం చేశారు.
అక్రమ వలసదారుల పట్ల అమెరికా వ్యవహరించిన తీరుపై బ్రెజిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యలను తీవ్రంగా పరిగణించింది. బ్రెజిలియన్ పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. ఇకపై పంపించే వారినైనా చేతులకు సంకెళ్లు లేకుండా.. గౌరవంగా తీసుకు రావాలని వెల్లడించింది. చూడాలి మరి అమెరికా మున్ముందు మరేం చేయనుందో.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa