తెలంగాణ వక్ఫ్ బోర్డు నుంచి ఏపీ వక్ఫ్ బోర్డుకు రావాల్సిన రూ.50 కోట్ల పెండింగ్ బకాయిలను ఇప్పించాలని సీఎం చంద్రబాబును రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కోరారు. గురువారం అమరావతి సచివాలయంలో చంద్రబాబును కలిసి పలు సమస్యలనువివరించారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ వక్ఫ్ బోర్డుకు చెందిన అన్ని రికార్డులు(డిజిటల్ రికార్డులతో సహా), పత్రాలు తెలంగాణ నుంచి బదిలీ చేయలేదని, ఆస్తులనూ అప్పగించలేదని తెలిపారు. చాలా వ్యాజ్యాలు, కోర్టు కేసులకు ఆ ఫైళ్లలోని సమాచారం అవసరమన్నారు. ఏపీ వక్ఫ్ బోర్డు వద్ద రికార్డులు లేని కారణంగా చట్టపరమైన విషయాల్లో కౌంటర్ దాఖలు చేయలేకపోతున్నామని తెలిపారు. త్వరితగతిన ఏపీ వక్ఫ్ బోర్డుకు చెందిన రికార్డులు అందేలా చేయాలని కోరారు. అలాగే, ఆదాయం లేని 1,500 మసీదుల పెండింగ్ దరఖాస్తులను, మసీదులు, ప్రహరీలు, శ్మశానవాటికలు, ఈద్గాలు, అషూర్ ఖానాలు, దర్గాలు తదితరాల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.10 కోట్లు, వక్ఫ్ ఆస్తులను ఆక్రమణల నుంచి రక్షించడానికి, ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు తదితరాలకు రూ.50 కోట్లు, హైకోర్టు, ఏపీ వక్ఫ్ ట్రైబ్యునల్, అపెక్స్ కోర్టుల్లో కేసులు వాదించడానికి చట్టపరమైన ఖర్చుల కోసం రూ.5 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఏపీ ఆన్లైన్ నిర్వాహకులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాలని, 2024లో రొట్టెల పండుగ, నెల్లూరులోని బారా షహీద్ దర్గా అభివృద్ధికి సంబంధించి ప్రకటించిన రూ. 5 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa