విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించిన విద్యార్థులు, ఏపీ మెడికల్ కౌన్సిల్(ఏపీఎంసీ) మధ్య వివాదం సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. తమకు ఏపీఎంసీ శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయట్లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని ఏపీఎంసీ, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కొంతమంది విద్యార్థులు సీఎం చంద్రబాబును కలిసి, సమస్యలను వివరించారు. వారి సమస్యలను విన్న సీఎం.. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. కొవిడ్తో పాటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొంతమంది వైద్య విద్యార్థులు కోర్సు మధ్యలోనే స్వదేశానికి తిరిగొచ్చారు. మిగిలిన కోర్సును ఆన్లైన్లో పూర్తిచేశారు.
నిబంధనల ప్రకారం విదేశాల్లో వైద్య విద్య అభ్యసించినవారు భారత్లో ఇంటర్న్షిప్, పీజీ కోర్సుల్లో చేరాలంటే ప్రత్యేక పరీక్షలో అర్హత సాధించాలి. అయితే కొవిడ్, యుద్ధం ప్రత్యేక పరిస్థితులు కావడంతో వీరికోసం 2023 నవంబరు 22న ఎన్ఎంసీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. చివరి ఏడాది ఆన్లైన్లో వైద్య విద్య చదివినవారు ఆయా రాష్ట్రాల్లో రెండేళ్ల పాటు ఇంటర్న్షిప్ చేయాలని నిబంధన విధించింది. ఈ మేరకు ఏపీఎంసీ అధికారులు విద్యార్థులకు లేఖ ద్వారా స్పష్టత ఇచ్చారు. అయితే ఏడాది ఇంటర్న్షిప్ పూర్తిచేసిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ ఇవ్వాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. ప్రస్తుతం ఇంటర్న్షిప్లో ఉన్న విద్యార్థులు ఎన్ఎంసీ నిబం ధనలు పాటించడానికి నిరాకరిస్తూ, తాము చదువుకున్న విదేశీ వర్సిటీల నుంచి తెచ్చిన కాంపెన్సేటరీ లేఖలు అంగీకరించాలని కోరుతున్నారు. అయితే ఆ లేఖల్లో వారు కోర్సులు పూర్తిచేసినట్లు స్పష్టంగా పొందు పరచలేదు. దీంతో విద్యార్థులకు శాశ్వత రిజస్ట్రేషన్లకు ఎన్ఎంసీ ఆంగీకరించడం లేదు.