గత వైసీపీ ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడల పేరుతో రూ.కోట్ల కుంభకోణానికి పాల్పడిందని శాప్(ఏపీ స్పోర్ట్స్ అథారిటీ) చైర్మన్ అనిమిని రవినాయుడు విమర్శించారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన మాట్లాడారు. ‘జగన్ ప్రభుత్వం రూ.199 కోట్లు ఆడుదాం.. ఆంధ్రకు కేటాయించి, పట్టుమని రూ.20 కోట్లు కూడా ఖర్చు చేయలేదు.
అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో గత శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మంత్రి హోదాలో రోజా కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. రూ.29 కోట్లు అవినీతి జరిగిందని గుర్తించి సీఐడీ, విజిలెన్సు అధికారులకు నేనే స్వయంగా ఆధారాలతో ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు. త్వరలోనే రూ.18 కోట్లతో స్పోర్ట్స్ మెటీరియల్ టెండర్లను పిలిచి హైస్కూల్ తో పాటు ప్రాథమిక పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్స్ను అందజేస్తామన్నారు.