ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు కారం ముద్దలు గుర్తున్నాయా,,,పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 07:40 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండిచేయి చూపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు భాగస్వామ్యులుగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి నిధులు సాధించలేకపోయాయని విమర్శించింది. ఎన్డీఏ సర్కారులో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన భాగస్వామిగా ఉన్నప్పటికీ.. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ఊసే ఎత్తలేదని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండిచేయి చూపించారంటే ఇది నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేతగానితనమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురావడం చేతగాని చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలపై విద్యుత్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి భారం మోపుతున్నారని ఆరోపించారు.


మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో నిధులు దక్కించుకోవటంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై రోజా విమర్శలు గుప్పించారు. గతంలో వైసీపీ ఎంపీలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందామంటూ రోజా ట్వీట్ చేశారు.


"రెండు కారం ముద్దలు తినండి , మరో రెండు కారం ముద్దలను ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి అని పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పట్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉంది. అయినా సరే ఎప్పటికప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటాలు చేశారు, పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, విభజన చట్టంలో గల అంశాలు... మొదలైన వాటిపై డిమాండ్ చేస్తూనే వచ్చారు. అయితే ఇప్పుడు ఏపీకి చెందిన తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ఎంపీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఊత కర్రల సాయంతో నడుస్తుంది. ఇప్పుడు అదే మాటలను ఏపీ ఎంపీలకు పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు..?" అంటూ రోజా ఎద్దేవా చేశారు.


మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విస్మరించారని కాంగ్రెస్ పార్టీ సైతం ఆరోపిస్తోంది. ఈ ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయనే కారణంతో బిహార్ రాష్ట్రానికి పెద్ద పీట వేశారని.. కానీ ఎన్డీఏ కూటమి సర్కారులో కీలకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దారుణంగా విస్మరించారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. అయితే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించారని టీడీపీ ఎంపీలు చెప్తున్నారు. విశాఖపట్నం పోర్టు, స్టీల్ ప్లాంట్, పోలవరం జాతీయ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారని గుర్తుచేస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com