కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2025లో కీలక నిర్ణయం తీసుకుంది. ఆభరణాలు, విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ బడ్జెట్లో ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆభరణాలు, వాటి విడిభాగాలకు సంబంధించిన వస్తువు కోడ్ 7113 కోసం కస్టమ్స్ టారిఫ్ను తగ్గిస్తన్నట్లు తెలిపారు. ప్రస్తుతం జువలెరీపై కస్టమ్స్ టారిఫ్ 25 శాతంగా ఉండగా దానిని ఈ బడ్జెట్లో 20 శాతానికి తగ్గించారు. తగ్గిన టారిఫ్ రేట్లు ఫిబ్రవరి 2, 2025 నుంచే అమలులోకి వస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే ప్లాటినం ఆభరణాలపై కస్టమ్స్ టారిఫ్ 25 శాతం నుంచి ఏకంగా 5 శాతానికి తగ్గించడం గమనార్హం.
గత ఏడాది జులై, 2024లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది కేంద్రం. 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. దీంతో దేశీయంగా బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. ఈసారి మళ్లీ పెంచుతారని అంతా భావించారు. కానీ, అలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు ఆభరణాలు, విడిభాగాలకు సంబంధించి కస్టమ్స్ టారిఫ్ భారీగా తగ్గిండంతో బంగారం, వజ్రాభరణాలు చౌకగా లభించనున్నాయి. కేంద్రం నిర్ణయంపై పలువురు జువెలర్స్ ప్రశంసలు కురిపించారు.
'జువెలరీ డ్యూటీని 25 శాతం నుంచి 20 శాతానికి తగ్గించడం స్వాగతించదగిన నిర్ణయం. పెద్ద ఎత్తున జువెలరీ వినియోగించే భారత్ వంటి దేశానికి ఇలాంటి నిర్ణయం కీలకంగా మారుతుంది. ఈ నిర్ణయం కచ్చితంగా డొమెస్టిక్ మార్కెట్లో డిమాండును పెంచుతుంది. ముఖ్యంగా లగ్జరీ మార్కెట్లో డిమాండ్ పుంజుకుంటుంది. అలాగే ప్లాటినం వస్తువులపై కస్టమ్స్ టారిఫ్ 25 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం మరో కీలక నిర్ణయం. ఈ నిర్ణయం మొత్తం రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు ఊతమిస్తుంది.' అని కామా జువెలరీ ఎండీ కొలిన్ షా ఎకనామిక్ టైమ్స్తో చెప్పారు.
మరోవైపు.. మధ్య తరగతి వినియోగాన్ని పెంచే అంశంపై ఈ బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ సువాంకర్ సెన్. అగ్రికల్చర్ సెక్టార్కి ప్రోత్సాహకాలు కల్పించడంతో గ్రామీణ డిమాండ్ పెంచడం, గ్రామీణ ఉత్పాదకతను పెంచేందుకు సాయపడుతుందన్నారు. అలాగే మహిళలు, యువతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.