వేతన జీవులకు ఈసారి బడ్జెట్లో భారీ ఊరట కలిగిన సంగతి తెలిసిందే. ముందు నుంచి ఉన్న అంచనాలకు తగ్గట్లుగానే .. వాస్తవంగా చెప్పాలంటే అంచనాల్ని మించి ప్రకటన వచ్చిందని చెప్పొచ్చు. కొత్త పన్ను విధానంలో ఇకపై రూ. 12 లక్షల వరకు వార్షికాదాయంపై టాక్స్ చెల్లించాల్సిన పని లేదని చెప్పారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ పన్ను ఊరట నిర్ణయంతో.. అదనంగా మరో కోటి మందికిపైగా పన్ను భారం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. వీరు ఇదివరకు పన్ను పరిధిలో ఉండేవారని అన్నారు. ఈ వర్గం వారు ఇప్పుడు బెనిఫిట్ పొందనున్నట్లు చెప్పారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆమె ఏం చెప్పారో చూద్దాం.
'బడ్జెట్లో ఆదాయపు పన్ను శ్లాబుల సవరణలతో ప్రజల చేతుల్లో ఇప్పుడు సరిపడా డబ్బులు చేతిలో ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంతకుముందు రూ. 8 లక్షల ఆదాయం ఉండే వారు ఇప్పటివరకు రూ. 30 వేలు టాక్స్ చెల్లించేవారు. ఇక మీదట వారు ఏమీ చెల్లించాల్సిన పని లేదు. ఇంకా మిగతా శ్లాబుల్లో ఉన్నవారికి కూడా ఊరట కలిగింది. రూ. 12 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ రిబేట్ పెంచడంతో కోటి మందికిపైగా దేశ ప్రజలు ఇకపై టాక్స్ చెల్లించడం నుంచి ఉపశమనం పొందారు.' అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఖర్చు చేసే ప్రతి రూపాయి విషయంలో కూడా తాము చాలా వివేకంతో వ్యవహరించామని.. ఆర్థిక వ్యవస్థలో ప్రతి అంశాన్ని కూడా స్పృశించేలా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. వ్యవసాయ రంగానికి కూడా అన్ని రకాలుగా అండగా ఉంటున్నామని.. దానికి తగ్గట్లుగానే వారికి ఊరట కల్పించినట్లు నిర్మలా సీతారామన్ అన్నారు. రుణాలు, కొత్త వంగడాల సృష్టి, పెట్టుబడి సాయం ఇలా అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నట్లు వివరించారు. బ్యాంకుల నుంచి వారికి రుణ సదుపాయాన్ని మరింత చేరువ చేశామని అన్నారు.
బడ్జెట్లో పాత పన్ను విధానం గురించి నిర్మలా సీతారామన్ ఏం ప్రస్తావించలేదు. ఇదే సమయంలో వచ్చే వారంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. మరి అందులో ఏమేం మారతాయో చూడాలి. ఇక కొత్త పన్ను విధానంలో ఇప్పుడు రూ. 12.75 లక్షల వరకు (స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలతో కలిపి) పైసా టాక్స్ చెల్లించనక్కర్లేదు. అయితే ఈ సమయంలో.. ఇతర ఆదాయాలపై రూ. 12, 15, రూ. 20, 24 లక్షలపై పన్ను ఎంత పడుతుందో ఇక్కడ చూడండి.