కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన వార్షిక బడ్జెట్ 2025లో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల వద్ద డిపాజిట్లు చేసే వారికి శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించింది. జనరల్ కస్టమర్లు (60 సంవత్సరాల లోపు వారికే) కే ఈ పెంపు వర్తించనుంది. ప్రస్తుతం సాధారణ కస్టమర్లకు డిపాజిట్ల వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ లిమిట్ రూ. 40 వేలుగా ఉండగా దానిని రూ.50 వేలకు పెంచుతున్నట్లు బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. సవరించిన కొత్త పన్ను పరిమితి అనేది ఏప్రిల్ 1, 2025 నుంచే అమలులోకి రానుంది.
టీడీఎస్ అంటే ఏంటి?
ఫిక్స్డ్ డిపాజిట్లపై ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన పరిమితికి మించి వడ్డీ ఆదాయం పొందినప్పుడు సదరు వడ్డీపై బ్యాంకులు పన్ను కట్ చేయాల్సి ఉంటుంది. ఈ పరిమితి అనేది సాధారణ కస్టమర్లు, సీనియర్ సిటిజన్లకు వేరు వేరుగా ఉంటుంది. పాన్ కార్డు ఉన్న వారికి ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి 10 శాతం టీడీఎస్ కట్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డు లేకుంటే 20 శాతం మేర పన్ను పడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194 ఏ కింద టీడీఎస్ కట్ చేస్తారు. జనరల్ కస్టమర్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్ లిమిట్ రూ. 40 వేల నుంచి రూ. 50 వేలకు పెంచారు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీపై టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆదాయపు పన్ను విభాగం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత పరిమితికి మించి వడ్డీ వచ్చినప్పుడు మాత్రమే టీడీఎస్ కట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారే అదే బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థ టీడీఎస్ కట్ చేయాలి. పాన్ కార్డు వివరాలు అందుబాటులో ఉన్నప్పుడు 10 శాతం టీడీఎస్ కట్ చేయాలి. పాన్ కార్డు లేని సందర్భంలో 20 శాతం టీడీఎస్ కట్ చేయాలి. ఒక వేల జాయింట్ అకౌంట్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు ప్రైమరీ అకౌంట్ హోల్డర్ ఆధారంగా టీడీఎస్ కట్ చేయాల్సి ఉంటుంది. రెండో ఖాతాదారుడికి ఎలాంటి సంబంధం ఉండదు.