ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త పన్ను విధానం.. ఒక్కసారిగా రూ.12 లక్షలకు పెంపు

business |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 11:42 PM

కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించింది. వ్యక్తి గత ఆదాయపు పన్నులో ఏకంగా రూ.12 లక్షలకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. దీంతో లక్షల మంది ట్యాక్స్ పేయర్లకు ఉపశమనం లభించినట్లయింది. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై జీరో ట్యాక్స్ ఉంటుంది. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ప్రతి ఏడాది రూ.80 వేల వరకు ఆదా కానున్నాయి. అయితే, ఒక్కసారిగా కేంద్రం ఎందుకింత ఊరట ఇచ్చింది? కొత్త పన్ను విధానంపైనే ఎందుకు ఫోకస్ పెట్టింది? ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


దేశీయ వృద్ధి రేటు మందగించడం, ప్రజలు కూడా ఖర్చులను తగ్గించుకోవడం, కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత పన్ను విధానంతో పోలిస్తే కొత్త పన్ను విధానాన్ని చాలా సరళంగా ఉండేలా చేసింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారుల్లో 70 శాతం మంది వరకు కొత్త పన్ను విధానానికి మారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు తాజాగా కొత్త పన్ను విధానంలో మరిన్ని పన్ను శ్లాబులు తీసుకొచ్చింది కేంద్రం. దీంతో పాత పన్ను విధానం ఇక చాలా మందికి పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుందని నిపుణులు చెబుతున్నారు.


ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ దయ చూపడం లేదన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. 2022లో ప్రెస్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశీయ జనాభాలో 31 శాతం మంది (43.2 కోట్లు మంది) మధ్య తరగతి వారే ఉన్నారు. 2046 నాటికి ఈ సంఖ్య 100 కోట్లు దాటేస్తుందని అంచనా వేసింది. ఇది అప్పటి జనాభాలో 61 శాతానికి చేరుకుంటుంది. మరోవైపు.. ఢిల్లీ, బిహార్‌లో ఎన్నికలు ఉన్నాయి. ప్రతి పక్షాలు ఇప్పటికే మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో కేంద్రం బడ్జెట్ రూపంలో మధ్య తరగతికి గాలం వేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పన్ను మినహాయింపులతో పాటు తాజాగా అద్దెలపై కూడా టీడీఎస్‌ను రూ.2.40 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచే నిర్ణయం సైతం మధ్య తరగతిని లక్ష్యంగా చేసుకున్నేవేనని చెప్పవచ్చు.


ప్రభుత్వం తాజా నిర్ణయంతో పన్ను చెల్లింపుదారులు ఒక్కొక్కరు అత్యధికంగా రూ.80 వేలు వరకు లబ్ధి పొందవచ్చు. ఆర్థిక వ్యవస్థలోకి లక్షల కోట్ల రూపాయలు వెళతాయి. దీంతో ఈ నిధులను కొనుగోళ్లు, పెట్టుబడులకు మళ్లిస్తారని కేంద్రం అంచనా వేసింది. దీంతో పాటు వస్తువులను కూడా ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్న రకాల వస్తువులపై పరోక్ష పన్నులను సైతం తగ్గించారు. మొబైల్ ఫోన్లకు విడిభాగాలకు సంబంధించిన కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. దీంతో వినిమయం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని కేంద్రం ఆలోచన. ఈ బడ్జెట్ నిర్ణయాలతో ఆటో మొబైల్, రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ రంగాలకు లబ్ది చేకూరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిపైనే పన్ను మిగులు సొమ్మును వినియోగదారులు వెచ్చించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com