2025 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను విధానానికి సంబంధించి కీలక మార్పులు చేసింది. ఇక్కడ మధ్యతరగతి వర్గానికి, వేతన జీవులకు ఊరట కలిగించేలా కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే ఇదే సమయంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలుగా ఉండగా.. దీనిని పన్ను వర్తించే ఆదాయంపై తగ్గించుకోవచ్చు. అప్పుడు రూ. 12.75 లక్షల వరకు ఆదాయంపై పైసా టాక్స్ కట్టాల్సిన పని లేదని వెల్లడించారు. అంటే అంతకుముందు పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు టాక్స్ రిబేట్ ఉండగా.. ఇప్పుడు దీనిని రూ. 12 లక్షలకు పెంచారు. అయితే కనీస పన్ను మినహాయింపు పరిమితిని పెద్దగా పెంచలేదు. టాక్స్ శ్లాబుల్లో కూడా సవరణలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇక్కడ పన్ను విధానంలో మార్పులు చేసిన నేపథ్యంలో.. పన్ను లెక్కలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. కొత్త పన్ను విధానం ఎంచుకున్నట్లయితే అప్పుడు మీ ఆదాయంపై ఎంత టాక్స్ చెల్లించాలి అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ రూ. 12 లక్షలపైన ఆదాయం ఉన్న వారికి మాత్రం.. అన్ని పన్ను శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అంటే ఇక్కడ రూ. 12 లక్షలపైన ఆదాయం ఉన్నట్లయితే అప్పుడు రూ. 4 లక్షల వరకు ఆదాయంపై జీరో టాక్స్, రూ. 4-8 లక్షల ఆదాయంపై 5 శాతం, రూ. 8-12 లక్షల ఆదాయంపై 10 శాతం, రూ. 12-16 లక్షలపై 15 శాతం, రూ. 16-20 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ. 20-24 లక్షల ఆదాయంపై 25 శాతం, రూ. 24 లక్షలపైన అయితే 30 శాతం టాక్స్ లెక్కన చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఇప్పుడు కొత్త లెక్కల ప్రకారం.. రూ. 12 లక్షల ఆదాయంపై ఎంత టాక్స్ పడుతుంది. రూ. 13 లక్షలపై ఎంత పన్ను చెల్లించాలో తెలుసుకుందాం. నిర్మలా సీతారామన్ చెప్పినట్లు రూ. 12.75 లక్షల వరకు ఎలాంటి టాక్స్ పడదు. ఇక్కడ పాత పన్ను రేట్లతో పోలిస్తే ఇప్పుడు రూ. 80 వేల వరకు పన్ను ఆదా అవుతుందని నిర్మలమ్మ ప్రకటించారు. రూ. 18 లక్షల వార్షికాదాయంపై రూ. 70 వేలు ఆదా, రూ. 25 లక్షల వార్షికాదాయం ఉన్నట్లయితే రూ. 1.10 లక్షలు ఆదా చేసుకోవచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు.
రూ. 13 లక్షల ఆదాయంపై టాక్స్ ఎలా లెక్కించాలంటే.. ముందుగా ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలు తీసేయాలి. అప్పుడు పన్ను వర్తించే ఆదాయం రూ. 12,25,000 అవుతుంది. ఇక్కడ టాక్స్ రిబేట్ రూ. 12 లక్షలు ఉంది కదా.. పైన రూ. 25 వేలకే టాక్స్ పడుతుందనుకోవద్దు. ఇక్కడ లెక్కలు వేరే ఉంటాయి. మిగతా పన్ను శ్లాబుల్ని అన్నీ కలిపి లెక్కిస్తారు.
కొత్త పన్ను శ్లాబుల ప్రకారం.. 0-4 లక్షల వరకు టాక్స్ ఉండదు. ఇక్కడ రూ. 4 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది కాబట్టి దీనిని మీ పన్ను వర్తించే ఆదాయం రూ. 12,25,000 నుంచి తీసేయాలి. అప్పుడు రూ. 8,25,000 అవుతుంది. తర్వాత శ్లాబ్ రూ. 4-8 లక్షల మధ్య ఆదాయానికి 5 శాతం టాక్స్ ఉండగా.. ఇక్కడ విధించదగిన మొత్తం రూ. 4 లక్షలపై 5 శాతం అంటే రూ. 20 వేలు పడుతుంది. ఇంకా మిగిలి ఉన్న ఆదాయం రూ. 4,25,000. తర్వాత రూ. 8-12 లక్షల శ్లాబ్పై 10 శాతం అంటే ఇక్కడ పన్ను విధించదగిన రూ. 4 లక్షలపై 10 శాతం.. రూ. 40 వేలు టాక్స్ పడుతుంది. తర్వాత మిగిలి ఉన్న ఆదాయం రూ. 25 వేలు. నెక్ట్స్ శ్లాబ్ రూ. 12-16 లక్షల ఆదాయంపై 15 శాతం టాక్స్ అంటే.. ఇక్కడ రూ. 25 వేలపై రూ. 3,750 పడుతుంది. ఇలా మొత్తం చెల్లించాల్సిన టాక్స్ = రూ. 20000+ 40000+ 3750= 63,750 టాక్స్ పడుతుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. A అనే వ్యక్తికి రూ. 12.75 లక్షల ఆదాయంపై టాక్స్ జీరోగా ఉంటే.. రూ. 13 లక్షలు సంపాదించే B అనే వ్యక్తి రూ. 63,750 టాక్స్ కట్టాల్సి వస్తుంది. అప్పుడు A కంటే B ఎక్కువ నష్టపోతున్నాడని చెప్పొచ్చు.