పార్వతీపురం మన్యం జిల్లా.. పాలకొండ నగర పంచాయితీ చైర్పర్సన్ ఎన్నికపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు ముగియడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. సుజాత మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. పార్వతీపురం మన్యంజిల్లా పరిధిలోని పాలకొండ నగర పంచాయితీ చైర్పర్సన్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే.. దీనిని సవాల్ చేస్తూ ఎం. స్వర్ణకుమారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నగర పంచాయితీ పరిధిలోని 19వ వార్డుకు ఉప ఎన్నిక నిర్వహించేవరకు చైర్పర్సన్ ఎన్నిక జరపకుండా నిలువరించాలని కోరారు.ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు రాగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘చైర్ పర్సన్ పదవి ఎస్టీలకు రిజర్వ్ చేశారు. 19వ వార్డుకు ఉప ఎన్నిక నిర్వహిస్తే పిటిషనర్ ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఇతర సభ్యుల మద్దతుతో చైౖర్పర్సన్గా ఎన్నికయ్యే అవకాశం కూడా ఉంది.’’ అని వివరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్సజీపీ) ఎస్. ప్రణతి, స్టాండింగ్ కౌన్సిల్ వల్లభనేని శిరీష వాదనలు వినిపిస్తూ.. ‘‘వ్యాజ్యం దాఖలు చేసే అర్హత పిటిషనర్కు లేదు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ప్రస్తుతం ఉన్న వార్డు సభ్యుల్లో ఎస్టీ మహిళ ఉన్నారు. చట్ట నిబంధనల ప్రకారం కోరం ఉన్నప్పుడు ఖాళీలతో సంబంధం లేకుండా చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించవచ్చు.’’ అని పేర్కొన్నారు.