అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అక్రమ వలస దారులను తిరిగి వారి స్వస్థలాలకు పంపిచేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ప్రత్యేక విమానాల ద్వారా.. చొరబాటుదార్లను గుర్తించి మరీ వారి ఇళ్లకు పంపించి వేస్తున్నారు. దేశ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో బహిష్కరణలు చేపడుతుండగా.. వీటికి భారీ స్థాయిలో ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పౌర విమానాల్లో వెళ్లే దానికంటే ఐదు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నా ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అక్రమ వలసదారులను ఇంటికి పంపించి వేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
అక్రమ వలసదారులను ఇళ్లకు పంపించేందుకు అమెరికా రక్షణ శాఖ రెండు సీ-17, రెండూ సీ-130ఈ మిలిటరీ విమానాలను ఉపయోగిస్తోంది. అయితే సీ-17 విమాన నిర్వహణ ఖర్చు గంటకు 21 వేల డాలర్లు. అలాగే సీ-130ఈ విమానానికి గంటకు 68 వేల నుంచి 71 వేల డాలర్లు ఖర్చు అవుతుందట. ఇలా సీ-17 విమానానికి ఒక రోజుకు అంటే 24 గంటలకు 5.04 లక్షల డాలర్లు అవుతుండగా.. సీ-130ఈ కి 16.32 లక్షల డాలర్ల నుంచి 17.04 లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది.
ముఖ్యంగా గ్వాటెమాలాకు పంపించేందుకు ఒక్కో వ్యక్తి 4675 డాలర్లు ఖర్చు కాగా.. సాధారణ టికెట్ ధర 853 డాలర్లు మాత్రమే. దీనితో పోలిస్తే గ్వాటెమాలాకు వెళ్లేందుకు ఒక్కో వ్యక్తికి సాధారణ విమాన ధరతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ. ఈ ధరలు అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నడిపించే చార్టర్ ఫ్లైట్ టికెట్ల ధరల కంటే కూడా ఎక్కువ కావడం గమనార్హం.
అలాగే సీ-17 విమానం ద్వారా ఈరోజు మొత్తంగా 205 మంది భారతీయులను అమెరికా సర్కారు ఇండియాకి తరలిస్తోంది. అయితే దీని ప్రయాణ సమయం 24 గంటలు కాగా.. ఒక్కో వ్యక్తిపై యూఎస్ 5.04 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇలా 205 మందికి గాను 10 కోట్ల 32 లక్షల 20 వేల డాలర్లు ఖర్చు చేస్తోంది.
ఇదంతా ఇలా ఉండగా.. ఐసీఈ డైరెక్టర్ టీ జాన్సన్ ఇటీవలే అక్రమ వలసదారులను పంపించేందుకు అమెరికా ఒక్కో వ్యక్తిపై ఎంత ఖర్చు చేస్తుందో వివరించారు. ముఖ్యంగా డిపోర్టేషన్ విమానాల ఖర్చు గంటలు 17 వేల డాలర్లు కాగా.. 135 మంది సామర్థ్యం ఉన్న విమానంలో ఒక్కో అక్రమ వలసదారుడిని పంపించేందుకు గంటలకు 630 డాలర్లు అవుతుందని వివరించారు. కానీ దీనిపై మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించలేదు. అక్రమ వలసదారులను పంపించేందుకు ఎంత మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతున్నాయో ప్రకటించలేదు.