తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన ఆదివారం రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు అశ్వవాహనంపై సోమస్కందమూర్తి ఊరేగి భక్తులను అనుగ్రహించారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు ఆకట్టుకున్నాయి.
ఏడో రోజు రాత్రి స్వామివారు అశ్వంపై కూర్చొని, తనవేగశక్తినీ, బలశక్తినీ నిరూపిస్తుంటారు. వేగశక్తి అశ్వలక్షణం. ఇంద్రునికి ఏనుగుతోపాటు గుర్రం కూడా వాహనంగా ఉంది. ఆధ్యాత్మికంగా పరమాత్మే అశ్వం. ఆయనే మనహృదయంలోఉండి, ఇంద్రియాల్ని నియమిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఇవో శ్రీ నాగరాజు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్కుమార్, అర్చకులు శ్రీ స్వామినాథ స్వామి, శ్రీ విజయస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.