ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి తీపికబురు అందించింది. ఈ వర్సిటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఏపీ ప్రభుత్వం పెంచింది. అగ్రికల్చరల్ యూనివర్సిటీలతో పాటుగా ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలలో పనిచేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉంది. అయితే దీనిని 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయం సహా అనుబంధ రంగాలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవల సమీక్ష జరిపారు. ఈ సందర్భంగానే వర్సిటీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందుకు చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.
మరోవైపు వ్యవసాయ, అనుబంధ రంగాలపై జరిపిన సమీక్షలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు .రాష్ట్రంలో సన్న రకాల వరి సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సన్న రకాల వరిని పండించే రైతులకు ప్రత్యేక బోనస్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించడంతో పాటుగా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సన్న రకాల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సన్న రకాల వరి సాగును పెంచాలని నిర్ణయించింది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సన్న రకాల వరి సాగును పెంచాలని.. అందుకు ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
మరోవైపు బీసీ కార్పొరేషన్ రుణాలపైనా అధికారులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. యాదవ, కురబ సామాజిక వర్గాలకు చెందినవారికి కార్పొరేషన్ల ద్వారా రాయితీపై గొర్రెలు, మేకల పంపిణీ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. కోకో, అంతరపంటల సాగుకు ప్రోత్సాహమివ్వాలని సూచించారు. అంతరపంటలు సాగు చేసే రైతన్నలకు అధిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. చిరుధాన్యాలు సాగుకు చేయూత ఇవ్వాలని.. జూన్లోనే నారుమళ్లకు సాగు నీరు విడుదల చేయాలని సూచించారు. రాయలసీమను ఉద్యాన హబ్గా తీర్చిదిద్దేలా.. అనంతపురంలో పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa