ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ వలసదారులను తరిమేస్తున్న డొనాల్డ్ ట్రంప్.. భయంతో అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

international |  Suryaa Desk  | Published : Sun, Feb 09, 2025, 08:20 PM

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తూ.. వారిని తరిమికొడుతున్నారు. అయితే అమెరికా నుంచి అక్రమ వలసదారులను పంపించేస్తుండటంతో అక్కడ నివసిస్తున్న వారు ఎప్పటికప్పుడు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా న్యూయార్క్‌లో ఉంటున్న ఓ తెలుగు విద్యార్థి.. భయంతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. న్యూయార్క్‌లో చదువుతున్న తుమ్మేటి సాయికుమార్ రెడ్డి.. తాను ఉంటున్న రూంలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.


న్యూయార్క్‌లో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న తుమ్మేటి సాయికుమార్‌ రెడ్డి.. తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అతని ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన తుమ్మేటి సాయికుమార్ రెడ్డి.. స్వస్థలం ఎక్కడ, అతని వివరాలు ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. డిపోర్టేషన్‌ భయంతోనే తుమ్మేటి సాయికుమార్ రెడ్డి.. ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్న అమెరికా అధికారులు.. ఇటీవలె సాయికుమార్‌ రెడ్డి పనిచేసే చోట తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతని పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తనను కూడా తిరిగి భారత్‌కు పంపిచేస్తారని భయపడి.. తన రూంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.


డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక.. అమెరికాలో ఉంటున్న చాలా మంది విద్యార్థులకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారినట్లు తెలుస్తోంది. ఒకవైపు.. పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ లేక మరోవైపు ఎడ్యుకేషన్‌ లోన్‌ చెల్లించాల్సి రావడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. స్వదేశంలో ఉంటున్న తల్లిదండ్రులను ఇంకా ఇబ్బంది పెట్టలేక సతమతం అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం మాదన్నపేటకు చెందిన బండి వంశీ అనే 25 ఏళ్ల యువకుడు అనుమానాస్పద రీతిలో మరణించడం తీవ్ర కలకలం రేపింది. కాంకోర్డియా సెయింట్‌ పాల్‌ యూనివర్సిటీలో చదువుతున్న వంసీ.. 8580 మాగ్నోలియా ట్రైల్‌ ఈడెన్‌ ప్రెయిరీ అపార్ట్‌మెంట్‌లో పార్క్‌ చేసిన కారులో శవంగా కనిపించాడు.


అక్రమ మార్గాల్లో అమెరికాకు వచ్చిన వారు.. వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉంటున్న వారిని గుర్తించి మరీ.. వారిని స్వదేశాలకు పంపించేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో అక్రమంగా ఉంటున్న 205 మంది భారతీయులతో కూడిన విమానం ఇటీవలె పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దిగింది. మరోవైపు.. ఇలా అమెరికాలో అక్రమ మార్గాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య దాదాపు 8 లక్షలు అని తెలుస్తోంది. విడతల వారీగా వారందర్నీ అమెరికా నుంచి తరలించేందుకు ట్రంప్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే అక్రమ మార్గాల్లో విదేశాల్లో నివసించడాన్ని వ్యతిరేకిస్తున్న భారత్ కూడా.. ఈ ప్రక్రియలో అమెరికాకు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com