దేశీయంగా బంగారం ధర భారీగా పెరిగింది. సరికొత్త రికార్డులను నమోదు చేసింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా రూ.2430 పెరిగి రూ.88,500 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. గత వారం 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.86,070 వద్ద ఉండగా.. ఒక్కసారి రెండువేల రూపాయల మేర పెరగడం గమనార్హం. అంతర్జాతీయ పరిణమాలు, రూపాయి క్షీణత పుత్తడి ధర పెరుగుదలకు కారణమని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.అంతర్జాతీయ విపణిలోనూ స్పాట్గోల్డ్ ఔన్సు 2900 డాలర్ల మార్కు దాటడం గమనార్హం. అమెరికా దిగుమతి చేసుకునే అల్యూమినియం, స్టీల్పై 25 శాతం సుంకం విధిస్తామని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం పసిడి డిమాండ్ ఒక్కసారి ఊపందుకోవడానికి కారణమైంది. కమొడిటీ ఎక్స్ఛేంజ్లో ఏప్రిల్ నెల డెలివరీ పసిడి కాంట్రాక్ట్ రూ.940 మేర పెరిగి రూ.85,828కి చేరింది. అటు వెండి సైతం కేజీకి వెయ్యి రూపాయలు మేర పెరిగి రూ.97,500కు చేరింది.