ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం నివాసం విషయంలో వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న బీజేపీ...ఎందుకంటే

national |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 08:10 PM

ఫిబ్రవరి 5వ తేదీన జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను 8వ తేదీన వెల్లడించారు. అయితే బీజేపీ ఈసారి ఎవరూ ఊహించని విధంగా 48 స్థానాలను దక్కించుకోగా.. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 సీట్లకే సొంతం అయింది. అలాగే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, అగ్రనాయకులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు కూడా ఓడిపోయారు. అగ్ర నాయకుల్లో కేవలం అతిశీ ఒక్కరే విజయం సాధించారు. ఇలా ఆప్ తీవ్ర పరాజయం పాలు కాగా.. బీజేపీ మాత్రం పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటోంది. అయితే కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు.


ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు అయినప్పటికీ.. శీష్ మహల్‌లో మాత్రం నివాసం ఉండరని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి చెందిన సీఎం ఈ బంగ్లాకు చాలా దూరంగా ఉండాలని.. కాషాయ దళం ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో.. సివిల్ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లాను ఆయన అధికారిక నివాసంగా ఏర్పరుచుకున్నారు. అయితే బీజేపీ ఈ నివాసాన్ని శీష్ మహల్ (అద్దాల మేడ)గా అభివర్ణిస్తోంది.


అందుకు ప్రధాన కారణం.. ఆ భవనాన్ని దాదాపు రూ.80 కోట్ల రూపాయల ప్రజాధనంలో మరమ్మత్తులు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఈ శీష్ మహల్‌ను ఆయుధంగా వాడుకుంటూ.. ఆరవింద్ కేజ్రీవాల్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం.. దీనిపై విమర్శలు గుప్పించారు. నాలుగు కోట్ల మంది ప్రజలకు తాము ఇళ్లు కట్టించామని చెబుతూనే.. నేనేమీ అద్దాల మేడ కట్టుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ నివాసానికి సంబంధించి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.


పలువురు బీజేపీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. తమదైన స్టైల్లో విమర్శలు చేశారు. వీటన్నిటినీ చూసిన ఢిల్లీ ప్రజల మదిలోకి ఆ అంశం బాగానే వెళ్లింది. ఇలా ఆప్ ఓటమికి ఓ కారణంగా పనికొచ్చిన ఈ శీష్ మహల్‌లో బీజేపీ ముఖ్యమంత్రి ఉన్న వ్యతిరేకత వస్తుందని భావించిన కాషాయ దళం.. దీన్ని దూరంగా పెట్టాలని భావిస్తోందట. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com