ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యక్తిగత గొడవలని మాపై రుద్దితే సహించేదిలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 05:12 PM

రాప్తాడు వైసీపీ నేతలకి ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరికలు జారీచేశారు. మా దృష్టంతా నియోజకవర్గ అభివృద్ధి వైపే ఉంది,  మీపైకి దృష్టి మరల్చేలా చేసుకోవద్ద’ని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరించారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అనంతపురంలోని తన నివాసంలో ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం మీడియాతో మాట్లాడారు.


కనగానపల్లి మండలం గుంతపల్లిలో వ్యక్తిగత కారణాలతో జరిగిన గొడవను రాజకీయం చేస్తూ తమ కుటుంబంపై విమర్శలు చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనలో రెండు వైపుల వారికి గాయాలయ్యాయన్నారు. దీనిని వైసీపీ దాడిగా తాము ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. గతం నుంచి వారి మధ్య వ్యక్తిగత కారణాలు, మనస్పర్థల నేపథ్యంలోనే గొడవ పడ్డారన్నారు. ఆ ఇద్దరి మధ్య జరిగిన గొడవను తెలుగుదేశం పార్టీకి, పరిటాల కుటుంబానికి ఆపాదిస్తారా అంటూ ఆమె మండిపడ్డారు. ‘గత ఐదేళ్లలో మీరు.. ఎంత మందిపై అక్రమ కేసులు పెట్టించారో లెక్కేలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాల’ని తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, మాధవ్‌కు హితవు పలికారు. పోలీసు వ్యవస్థ గురించి ప్రకా్‌షరెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని వ్యవస్థల్ని నాశనం చేయడంతోపాటు వాటిని స్వార్థం కోసం వాడుకున్న సంగతి మర్చిపోయారా అని ప్రకాష్‌రెడ్డిని ఆమె నిలదీశారు. ఇప్పుడిప్పుడే నిద్రలేచి ఖబడ్దార్‌ అంటూ మాధవ్‌ అరుస్తున్నట్లుగా ఉందన్నారు. గతంలో మీరు చేసిన వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుందన్నారు. సభ్యత, సంస్కారం ఉంది కాబట్టి చెప్పడం లేదన్నారు. గత ఐదేళ్లలో ఎన్ని అరాచకాలు, దౌర్జన్యాలు చేసినా పట్టించుకోకుండా తాము నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి పెట్టామన్నారు. ‘అదే మీరు చేసిన వాటికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన వచ్చినా.. మీరన్నట్టు రాజకీయంగా చూడాల్సి వస్తే ఆ కథ వేరేలా ఉంటుంద’ని ఆ ఇద్దరు నేతలను ఆమె హెచ్చరించారు. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఓ వైపు ప్రకా్‌షరెడ్డి.. మరోవైపు గోరంట్ల మాధవ్‌ పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. వారిలో వారికే పొసగక అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎక్కడైనా చిన్నచిన్న ఘటనలు జరిగితే దానికి రాజకీయాల్ని ఆపాదించుకుంటూ అమాయక కార్యకర్తల్ని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. చిన్న గొడవ జరిగినా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆ ఇద్దరు నేతలకు పరిటాల సునీత హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com