ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంతో చేయాలని ఉంది కానీ..చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 07:24 PM

సంక్షేమ పథకాల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు శనివారం పర్యటించారు. కందుకూరుల మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. సంక్షేమ పథకాల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై వైసీపీ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేస్తేనే అమలు చేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్న చంద్రబాబు.. అప్పులు చేస్తేనే కానీ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


ఏపీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా కూడా ఇచ్చిన హామీలలో ఇప్పటికే పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అన్న క్యాంటీన్ల ఏర్పాటు వంటి పథకాలను ప్రారంభించామని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రతి నెలా పేదల సేవలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 64 లక్షల మందికి పింఛన్లు 1వ తేదీనే ఇంటివద్దకు తీసుకెళ్లి ఇస్తున్నామని చంద్రబాబు వివరించారు. ఏడాదికి రూ.33 వేల కోట్లు పింఛన్ల రూపంలో ఇస్తున్నామన్న చంద్రబాబు.. ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్లు వంటి హామీలను కూడా ఎనిమిది నెలల కాలంలోనే అమలు చేశామని వివరించారు.


గత వైసీపీ పాలనలో సంపద పెరగలేదన్న ఏపీ సీఎం.. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో చేసిన అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కారణంతోనే ఏపీ ప్రజలకు ఎంతో చేయాలని ఉన్నా.. గల్లా పెట్టె సహకరించడం లేదంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.


మరోవైపు చెత్త నుంచి సంపదను సృష్టించే కార్యక్రమాలను చేపడుతున్నామన్న చంద్రబాబు .. పేపర్లు, బాటిళ్లను రీసైక్లింగ్ చేసే విధానాలను తీసుకువస్తున్నట్లు వివరించారు. అలాగే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచులదేనని.. పనితీరు ఆధారంగా సర్పంచులను ప్రోత్సహిస్తామన్నారు. అక్టోబర్ రెండో తేదీ నాటికి రాష్ట్రంలో చెత్త లేకుండా చేయాల్సిన బాధ్యతను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అప్పజెప్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మరోవైపు పీఎం సూర్యఘర్ పథకం కింద ఇళ్లపైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని.. సౌర విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని చంద్రబాబు సూచించారు. పేదరికం లేని సమాజం కోసం త్వరలోనే రాష్ట్రంలో పీ4 విధానం తెస్తామని చంద్రబాబు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa