ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయ్యప్ప భక్తులకు శబరిమల్లలో ఇక నేరుగా దర్శనాలు

national |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2025, 08:40 PM

శబరిమలకు వచ్చే భక్తులకు నేరుగా అయ్యప్ప స్వామి దర్శనం కల్పించేందుకు ఆలయ నిర్వహణ చూసుకునే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుముడితో వచ్చే స్వాములు.. 18 బంగారు మెట్లు (పదునెట్టాంబడి)ఎక్కిన తర్వాత నేరుగా అయ్యప్ప స్వామి దర్శనం కలిగించేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు అక్కడ ఉన్న ఫ్లైఓవర్‌ను అక్కడి నుంచి తీసివేయనున్నారు. దీని వల్ల బంగారు మెట్లు ఎక్కిన వెంటనే భక్తులకు అయ్యప్ప స్వామి కనిపించనున్నారు.


అయితే మార్చి 14వ తేదీ నుంచి శబరిమలలో మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని భక్తుల కోసం తెరవనున్నారు. ఆ సమయంలో ఈ అవకాశం కల్పిస్తామని ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఇరుముడితో వెళ్లే భక్తులు.. పవిత్రమైన 18 మెట్లు ఎక్కగానే.. ఎడమవైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి ఆలయం చుట్టూ.. సుమారు 500 మీటర్ల దూరం ఉండే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదుగా నడిచి వచ్చిన తర్వాత సన్నిధానం చేరుకోవాల్సి ఉండేది.


తాజాగా శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా అధికారులు కొత్త లేఅవుట్‌ను రూపొందించారు. దీని ప్రకారం సన్నిధానం చుట్టూ ఉన్న ఫైఓవర్‌ బ్రిడ్జిని తొలగించాలని నిర్ణయించారు. మీనమాస పూజల సందర్భంగా ఇరుముడితో వెళ్లే భక్తులు.. 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా ఏర్పాటు చేయనున్న రెండు లేదా నాలుగు లైన్ల ద్వారా వెళ్లి అయ్యప్ప సన్నిధానానికి చేరుకోవచ్చని తెలిపారు. భక్తులు బలికల్‌పుర(కణిక్క వంచి-నైవేద్య పాత్ర) మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకునే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.


తాజా నిర్ణయం వల్ల.. కణిక్కవంచి నుంచి వెళ్లేప్పుడు 30 సెకన్ల నుంచి నిమిషం పాటు అలాగే అయ్యప్పను దర్శించుకుంటూ ముందుకు సాగే అవకాశం ఉంటుంది. గతంలో సన్నిధానానికి ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే కేవలం 2, 3 సెకన్ల పాటు మాత్రమే అయ్యప్ప దర్శనం లభించేది. ఇక భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు.. తోపులాట కారణంగా పోలీసులు లాగేసేవారు. ఎంతో కష్టపడి మండలకాలం కఠిన దీక్షను పూర్తిచేసుకుని.. శబరిమలకు వెళ్లినా.. దర్శనం సరిగ్గా జరగలేదనే బాధ ఉండేది. తాజా నిర్ణయంతో అది కాస్త తగ్గనుంది.


శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్రస్తుతం కుంభమాస పూజలు జరుగుతున్నాయి. ఈనెల 21వ తేదీ వరకు శబరిమల అయ్యప్ప భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి తొలగింపు, ఇతర అభివృద్ధి పనులను ఈనెల 17వ తేదీ నుంచే చేపట్టనున్నారు. ఇక ఈ ఆలయ అభివృద్ధి పనులకు కేరళ హైకోర్టు కూడా ఆమోదం కల్పించింది. హైకోర్టు నియమించిన శబరిమల ప్రత్యేక కమిషనర్‌ ఆర్‌.జయకృష్ణన్‌, ట్రావెన్‌కోర్‌ బోర్డు అధ్యక్షుడు పీఎస్‌ ప్రశాంత్‌ పర్యవేక్షణలో పనులు పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం తొలగిస్తున్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని భక్తుల రద్దీ నేపథ్యంలో 1989లో ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa