ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లేందుకు దేశవ్యాప్తంగా జనం పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో.. రైలు ఎక్కుతుండగా.. ప్రయాణికుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరికొంత మంది స్పృహ తప్పి పడిపోయారు. తొక్కిసలాట జరగడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఢిల్లీలోని పలు ఆస్పత్రులకు తరలించి అధికారులు చికిత్స అందిస్తున్నారు.
ఇక ఈ తొక్కిసలాటలో చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నట్లు వివరించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని 14, 15 ప్లాట్ఫాంలపై ఈ దుర్ఘటన జరిగింది. మహా కుంభమేళా చివరి దశకు చేరుకున్నా భక్తుల రద్దీ భారీగా ఉండటంతో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలను నివారించి.. భక్తుల రద్దీని తగ్గించేందుకు 4 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే అనూహ్యంగా భారీగా భక్తులు పోటెత్తడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్లు వెల్లడించారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని 14వ నంబరు ప్లాట్ఫాంపై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండడంతో మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడికి భారీగా చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే అప్పటికే రావాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్.. భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం 12, 13, 14 నంబరు ప్లాట్ఫాంలపై వేచి ఉన్న ప్రయాణికులు.. ఒక్కసారిగా తరలిరావడంతోనే ఈ తొక్కిసలాటకు దారితీసినట్లు అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు.. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక మృతుల సంఖ్యపై రైల్వేశాఖ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న రైల్వే శాఖ.. అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ తొక్కిసలాటలో పలువురు చనిపోయినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వెల్లడించారు.
మరికొన్ని రోజుల్లో మహా కుంభమేళా ముగియనుండగా.. గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు ఎగబడుతున్నారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా కావడంతో.. ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రోడ్డు మార్గంలో వందల కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో.. రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు మొత్తం కిటకిటలాడుతున్నాయి. కొన్ని రైళ్లు ఫుల్ కావడంతో కనీసం డోర్లు కూడా తెరుచుకోలేని పరిస్థితుల్లో.. రైళ్ల అద్దాలు పగులగొడుతున్న దృశ్యాలు కూడా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa