ఉత్తర్ప్రదేశ్ సహరాన్పూర్కు చెందిన ఒక యువతికి.. ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్తో పెళ్లి జరిగింది. 2023 ఫిబ్రవరి 15వ తేదీన వారి వివాహం జరిగింది. కట్నకానుకల కింద యువతి తల్లిదండ్రులు మొత్తంగా రూ.15 లక్షలు ముట్టజెప్పారు. ఈ క్రమంలోనే పెళ్లి జరిగిన కొన్నిరోజులు ఆ యువతి పట్ల భర్త, అత్తామామలు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే వాళ్ల అసలు రాక్షసరూపం బయటికి వచ్చింది. కట్నం డబ్బులు కాకుండా.. స్కార్పియో కారు కొనాలని.. అందుకు రూ.25 లక్షలు పుట్టింటి నుంచి తీసుకురావాలని.. ఆ యువతిని అత్తామామలు వేధించసాగారు.
అయితే జరిగిన విషయాన్ని పుట్టింటివారికి ఆ యువతి చెప్పగా.. అంత డబ్బు తాము ఇచ్చుకోలేమని వారు చెప్పడంతో.. ఆ యువతిని ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లగొట్టారు. దీంతో గ్రామంలో పంచాయితీ పెద్దలను ఆశ్రయించగా.. అత్తింటివారికి నచ్చజెప్పి ఆ యువతిని తిరిగి కాపురానికి పంపించారు. అయినప్పటికీ బుద్ధి మారని ఆ అత్తమామలు.. ఆమెను మరిన్ని డబ్బులు తీసుకురావాలనే వేధింపులు మాత్రం ఆపలేదు. అదనపు కట్నం తీసుకురావాలని ఆ యువతిని మానసికంగా, శారీరకంగా తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు.
ఈ క్రమంలోనే తమ కుమారుడికి మరో పెళ్లి చేస్తే.. మళ్లీ కట్నం వస్తుందని ఆశపడ్డ తల్లిదండ్రులు ఆ యువతిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి కలిగిన ఇంజెక్షన్ను ఆ యువతికి ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన కొన్నిరోజులకు ఆ యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి తీసుకెళ్లి మెడికల్ టెస్ట్లు చేయించగా.. ఆమెకు హెచ్ఐవీ సోకినట్లు డాక్టర్లు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. దీంతో ఆమె భర్త అభిషేక్కు ఎయిడ్స్ టెస్ట్ చేయగా.. అతడికి హెచ్ఐవీ లేదని తేలింది. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు ఆమె అత్తమామలపై అనుమానంతో.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. చివరికి బాధితురాలు తండ్రి స్థానిక కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో గంగో కొత్వాలి పోలీసులు.. అభిషేక్, అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa