ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ తొక్కిసలాటలో.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

national |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2025, 08:47 PM

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్తూ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది చనిపోయారు. వారిలో 14 మంది మహిళలు.. నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. వీరే కాకుండా మరో 30 మంది ప్రయాణికులు కూడా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. చివరి నిమిషంలో రైలు ప్లాట్‌ఫాం మార్చడంతో.. తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు.. ఉన్న ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాం వైపు పరుగులు తీయడంతో తోపులాట జరిగి తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ ఘోర విషాదంలో చనిపోయిన 18 మంది వివరాలను అధికారులు విడుదల చేశారు. మృతులంతా ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించినట్లు తెలిపారు.


ఇక మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున రైల్వేశాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.2.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు తెలిపింది. స్వల్పంగా గాయాలు అయిన వారికి రూ.లక్ష చొప్పున సహాయం చేయనున్నట్లు వెల్లడించింది. మృతుల పేర్లను రైల్వే అధికారులు వెల్లడించారు. ఆహాదేవి, పింకి దేవి, షీలా దేవి, వ్యోమ్, పూనమ్ దేవి, లలితా దేవి, సురుచి, కృష్ణ దేవి, విజయ్, నీరజ్, శాంతిదేవి, పూజాకుమార్, పూనమ్, సంగీతా మాలిక్, రియా సింగ్, బేబి కుమారి, మనోజ్, మమతాఝా.. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారిగా గుర్తించారు.


మరోవైపు.. ఈ ఘోర దుర్ఘటనపై ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారంతా సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇంటికి వెళ్లిపోవాలని ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa