న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఇప్పటివరకు 18 మంది ప్రాణాలను బలితీసుకుంది. 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు, మరో ముగ్గురు పురుషులు చనిపోయినట్లు జయప్రకాష్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు భారీగా భక్తులు పోటెత్తడంతో.. ఈ తొక్కిసలాట జరిగినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ తొక్కిసలాట జరగడానికి కారణం ప్రయాణికుల్లో ఒక పుకారు చెలరేగడమేననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన రైళ్లు రద్దయ్యాయనే వార్తలు అక్కడ చక్కర్లు కొట్టడంతో.. అప్పటికే ప్లాట్ఫామ్పైకి వచ్చిన ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని 14, 15 ప్లాట్ఫాంలపై ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. మహా కుంభమేళాకు రైళ్లలో వెళ్లే భక్తుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. అయితే శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని 14వ నంబర్ ప్లాట్ఫాంపైకి ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ వచ్చి ఉంది. అయితే ప్రయాగ్రాజ్ వెళ్లే మరికొన్ని రైళ్లు.. 12వ నంబర్ ప్లాట్ఫాంపైకి స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్.. 13వ నంబర్ ప్లాట్ఫాంపైకి భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు రావాల్సి ఉండగా.. అవి రద్దు అయ్యాయనే పుకార్లు వ్యాపించాయి.
దీంతో అప్పటికే వచ్చి ఉన్న ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేందుకు.. 12, 13వ ప్లాట్ఫాంలపై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా 14వ ప్లాట్ఫాంపైకి పరుగులు తీశారు. ఈ క్రమంలోనే తమ వద్ద ఉన్న లగేజీ బ్యాగులు, చిన్న పిల్లలను ఎత్తుకుని పరుగు పరుగున పరుగులు పెట్టారు. దీంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్లపై నుంచి భక్తులు కిందపడిపోయారు. కింద పడిన భక్తులను తొక్కుకుంటూ వెళ్లి.. మిగిలిన ప్రయాణికులు కిందపడిపోయారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. ఇదంతా కేవలం 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే జరిగినట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు స్పృహ తప్పి పడిపోయినట్లు పేర్కొన్నారు. ఇక సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ఇక ఘటనా స్థలంలో బట్టలు, బ్యాగులు, చెప్పులు, చెల్లాచెదురుగా పడిపోయిన వస్తువులతో.. ఆ ప్రాంతం అంతా భీతావహంగా కనిపిస్తోంది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa