తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం త్రిశూలస్నానం వైభవంగా జరిగింది. అంతకుముందు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రీనటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ అన్నారావు సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం నిర్వహించారు. అనంతరం కపిలేశ్వరస్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. ఆ తరువాత పూర్ణాహుతి, కలశోధ్వాససం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరుగనుంది. హరిబ్రహ్మాదులకే లభ్యం గాని పవిత్రపాదపద్మాలను హృదయ చక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసిన రాక్షసభక్తుడు రావణుడు. తపస్సంపన్నుడైన రావణుడు పరదారాపహరణమనే దుర్మార్గాన్ని చేయడం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతుడయ్యాడు. ఇలాంటి రావణుడిని వాహనంగా చేసుకుని శ్రీకపిలేశ్వరస్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఇవో శ్రీ నాగరాజు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్కుమార్, అర్చకులు శ్రీ స్వామినాథ స్వామి, శ్రీ విజయస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa