గత నెలలో 106 చోరీ కేసులు నమోదైతే...వాటిలో 66 కేసులను ఛేదించినట్టు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి తెలిపారు. పోలీస్ కమిషనరేట్లో మంగళవారం ఏర్పాటుచేసిన క్రైమ్మేళా సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ 66 చోరీ కేసుల్లో 74 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.92 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఛేదించిన వాటిల్లో మూడు దోపిడీ, ఒక దారిదోపిడీ, పగటిపూట చోరీ ఒకటి, రాత్రిపూట చోరీలు 12, బస్సు దొంగతనం ఒకటి, కారు, ఆటోలు, బైక్లు, బస్సు చోరీ కేసులు ఉన్నాయన్నారు. నిందితుల నుంచి 310 గ్రాముల బంగారం, 536 గ్రాముల వెండి, రూ.4.56 లక్షల నగదు, ఏడు మోటారు సైకిళ్లు, ఒక బస్సు, ఒక కారు, రెండు ఆటోలు, నాలుగు ల్యాప్టాప్లు, రెండు టీవీలు, 313 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.నగరంలో నేరాలను నియంత్రించేందుకు శివారు ప్రాంతాల్లో వీధి దీపాల ఏర్పాటు, తుప్పల తొలగింపు, సీసీ కెమెరాలను ఏర్పాటు, రాత్రి క్రైమ్ బీట్లు పెంపు వంటివి చేస్తున్నామన్నారు. పాతనేరస్థుల కదలికలపై నిఘా ఉంచామన్నారు. చోరీ కేసుల్లో రికవరీని ప్రతి నెలా మెరుగుపరుచుంటూ వెళుతున్నామని సీపీ వివరించారు.ఐపీఎస్ సీజన్ ప్రారంభం కాబోతుండడంతో బెట్టింగ్ నియంత్రణపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేస్తామని పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీ అన్నారు. బెట్టింగ్ కేసుల్లో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశామని, మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. బెట్టింగ్కు పాల్పడేవారు, నిర్వహించేవారు ఎంతటి వారైనప్పటికీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీపీ స్పష్టంచేశారు. అలాగే నగరంలో రాత్రిపూట బైక్ రేసింగ్లు జరుగుతున్నట్టు తనకు ఫిర్యాదులు అందుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల స్వయంగా తానే అర్ధరాత్రి దాటిన తర్వాత నగరంలో పరిస్థితిని పరిశీలించేందుకు తిరుగుతుండగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద కొందరు యువకులు బైక్ రేసింగ్కు పాల్పడుతున్నట్టు గుర్తించానన్నారు. వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. ఈ సమావేశంలో క్రైమ్ డీసీపీ లతామాదురి, ఏడీసీపీ మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa