ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లండన్ నుంచి అమెరికాకు తరలిపోతున్న టన్నుల కొద్దీ బంగారం

international |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 11:13 PM

లండన్ నుంచి అమెరికాకు వేల కోట్ల విలువైన బంగారం తరలిపోతోంది. ఐరోపా దేశాలపైనా దిగుమతి సుంకాలు తప్పవంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలతో వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో యూకే బ్యాంకుల నుంచి టన్నుల కొద్దీ బంగారం అమెరికాకు వెళ్లిపోతుంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికన్లతో పాటు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధించిన ట్రంప్.. బంగారంపై కూడా విధించొచ్చన్న అంచనాలతో లోహ పరిశ్రమ ఒడిదొడుకులకు గురువుతోంది.


దీంతో లండన్‌లో బంగారం ధరలు పాతాళానికి పడిపోతుంటే.. న్యూయార్క్‌లో మాత్రం చుక్కలు చూపిస్తోంది. ట్రంప్‌ సుంకాల హెచ్చరికలతో లండన్‌లో బంగారం 20 డాలర్ల మేర క్షీణించింది. ఇదే సమయంలో అమెరికాలో ఔన్సు బంగారం 3000 డాలర్లకు సమీపించింది. ఈ పరిణమాలతో అప్రమత్తమైన జేపీ మోర్గాన్ చేజ్‌, హెచ్‌ఎస్‌బీసీ వంటి అమెరికా దిగ్గజ బ్యాంకులు.. లండన్‌లో వాల్ట్‌ల నుంచి తమ పుత్తిడి నిల్వలను హుటాహుటిన విమానాల్లో స్వదేశానికి రప్పిస్తున్నాయి.


లండన్‌ థ్రెడ్ నీడిల్ స్ట్రీట్‌లోని తొమ్మిది వాల్ట్స్‌లో 252 బిలియన్‌ డాలర్లు విలువైన వందల టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇదే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం నిల్వ కావడం విశేషం. వాణిజ్య యుద్ధ భయాలతో ఫిబ్రవరి నెలలోనే 4 బిలియన్ డాలర్ల బంగారాన్ని తరలించాలని జేపీ మోర్గాన్ భావిస్తోంది. 2020లో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్విస్‌ రిఫైనరీలు మూతపడినప్పుడు ఇలాంటి తరలింపు చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా, అధ్యక్ష ఎన్నికల రోజు నుంచి అమెరికాకు బంగారం తరలింపు విపరీతంగా పెరిగింది. గతేడాది నవంబర్ 5 నాటికి 50 బిలియన్‌ డాలర్ల నిల్వలు ఉండగా.. రెండు నెలల్లోనే అది 106 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.


మరోవైపు, గత ఏడాది మే నెలలో బ్రిటన్ నుంచి భారీగా బంగారం నిల్వలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా భారత్‌కు తరలించిన విషయం తెలిసిందే. దాదాపు 100 టన్నులు అంటే లక్ష కిలోల బంగారం దేశీయ ఖజానాకు తీసుకొచ్చారు. రవాణా, నిల్వ సర్దుబాట్లలో భాగంగానే ఇంతమొత్తం బంగారాన్ని భారత్ అక్కడ నుంచి స్వదేశానికి తరలించింది. ముంబయి మింట్‌ రోడ్డు సహా నాగ్‌పుర్‌లోని ఆర్బీబీ పాత కార్యాలయాల్లో బంగారం నిల్వ చేస్తుంటుంది. గత కొన్నేళ్లుగా పెద్దఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తోన్న ఆర్బీఐ.. దీన్ని ఎక్కడ దాచిపెట్టాలనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో విదేశాల్లోని మన బంగారం నిల్వలు గణనీయంగా పెరిగాయి. దీంతో కొంత మొత్తాన్ని భారత్‌కు తీసుకు రావాలని నిర్ణయించింది. కాగా, ఈ బంగారాన్ని వాణిజ్య విమానాల ద్వారా తరలిస్తున్నారు. భారీ భద్రత మధ్య రోడ్డు మార్గంలో విమానాశ్రయాలకు పంపి.. అక్కడ నుంచి విదేశాలకు తీసుకెళ్తుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa