ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క సిరీస్‌తో టాప్‌ ప్లేస్‌లోకి..బాబర్‌ను వెనక్కినెట్టిన టీమిండియా ప్రిన్స్

sports |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 11:40 PM

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను వెనక్కినెట్టేశాడు. ఈ ఫీట్ సాధించిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు.


ఛాంపియన్స్‌ ట్రోఫీ మరికొద్దిసేపట్లో ప్రారంభం అవుతుందనగా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో 796 రేటింగ్‌ పాయింట్లతో శుభ్‌మన్‌ గిల్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా రెండో స్థానంలో ఉన్న గిల్.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ రాణించి.. నంబర్‌ వన్ స్థానానికి వచ్చాడు. ఇన్ని రోజులు అగ్రస్థానంలో ఉన్న బాబర్ ఆజమ్‌ను వెనక్కినెట్టేశాడు. ఈ జాబితాలో బాబర్ ఆజమ్‌ 773 పాయింట్లతో ఉన్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 761 పాయింట్లతో మూడో ప్లేసులో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ ఆరు, శ్రేయస్‌ అయ్యర్‌ 9వ స్థానంలో ఉన్నారు.


ఇదే తొలిసారి కాదు..


కాగా శుభ్‌మన్ గిల్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అతడు ఈ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2023 సమయంలోనూ గిల్.. అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శుభ్‌మన్.. ఒక సెంచరీ సహా.. రెండు హాఫ్ సెంచరీలు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.


అగ్రస్థానానికి చేరిన నాలుగో భారత ఆటగాడు..


గిల్ కంటే ముందు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలు కూడా అగ్రస్థానానికి చేరుకున్నారు. ఈ ప్లేసుకు చేరుకున్న భారత నాలుగో ఆటగాడు గిల్‌.


బౌలర్ల ర్యాంకింగ్‌లో..


శ్రీలంక స్పిన్నర్ మహీశ్‌ తీక్షణ టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆఫ్ఘానిస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ను అధిగమించాడు. భారత్ తరఫున కుల్‌దీప్‌ యాదవ్ 4వ ప్లేసు, మహమ్మద్ సిరాజ్ 10వ ర్యాంక్‌లో ఉన్నారు. అల్‌రౌండర్ల విషయానికి వస్తే.. అఫ్ఘానిస్థాన్ వెటరన్ ప్లేయర్ మహమ్మద్ నబీ 1వ ర్యాంక్‌లో నిలిచాడు. సికిందర్ రజా రెండో ప్లేసులో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా పదో ప్లేసులో ఉన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa