కర్ణాటకలోని మైసూరు క్యాంపస్ నుంచి సుమారు 300 మంది ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ తొలగించడం వివాదాస్పదమైంది. వరుస ఎవాల్యుయేషన్ పరీక్షల్లో ఫెయిల్ అయిన క్రమంలో వారిని తొలగించిందని వార్తలు వచ్చాయి. పరీక్షల్లో విఫలమైన ట్రైనీలను బలవంతంగా ఆఫీసు క్యాంపస్ నుంచి బయటకు పంపించారని, ఫ్రెషర్లపై బౌన్సర్లను ప్రయోగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశం టెక్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది. కార్మిక శాఖ దర్యాప్తు వరకు వెళ్లింది. అయితే, ఈ విషయంపై తాజాగా ఇన్ఫోసిస్ స్పందించింది. తాము ఎలాంటి బలవంత ప్రయోగాలకు పాల్పడలేదని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఇన్ఫోసిస్ చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ అధికారి షాజీ మాథ్యూ పీటీఐ వార్త సంస్థ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. 'ట్రైనీలను బెదిరించి మైసూర్ ఆఫీస్ క్యాంపస్ నుంచి బయటకు పంపించారంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. బౌన్సర్లను పెట్టి బయటకు గెంటించడమనేది అసత్య ప్రచారం. ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేసేందుకు కఠిన పరీక్షలు నిర్వహించారంటూ ఆరోపణలు చేయడం సరికాదు. ఫ్రెషర్లకు ఎంతో శ్రమకోర్చి శిక్షణ ఇస్తాం. వారికి శిక్షణ సమయంలోనూ జీతం చెల్లిస్తాం. అలాంటి వారిని బయటకు పంపించడం అంటే వారికే కాదు కంపెనీకి నష్టమే. వరుసగా మూడు ఎవాల్యుయేషన్ పరీక్షల్లో విఫలమైన వారినే తొలగించాం' అని షాజీ మాథ్యూ పేర్కొన్నారు.
ఫ్రెషర్లను తొలగించడంపై ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. కార్మిక శాఖ ఆదేశాల మేరకు కర్ణాటక రాష్ట్ర లేబర్ మినిస్ట్రీ ఇన్ఫోసిస్పై దర్యాప్తు చేపట్టింది. అయితే కార్మిక శాఖ తమతో సంప్రదింపులు జరుపుతోందని, తమ శిక్షణ ప్రక్రియ, మూల్యాంకనం మొదలైన వాటిని వారికి వివరిస్తున్నట్లు చెప్పారు మాథ్యూ. వారికి పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. అలాగే తొలగించిన వారిని తిరిగి నియమించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. వారందరికీ అత్యుత్తమ శిక్షణ ఇస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa