ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెక్యూరిటీ వలయంలో పాకిస్తాన్,,,12 వేల మంది పోలీసులు, ఛార్టర్ ఫ్లైట్స్

sports |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 11:43 PM

పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ అనగానే అందరిలో తలెత్తిన మొట్టమొదటి ప్రశ్న ఆ కంట్రీలో క్రికెట్ ఆడటం సేఫేనా? దాదాపు అన్ని దేశాల్లో ఇదే ప్రశ్న మొదలైంది. 2009లో శ్రీలంక జట్టుపై లాహోర్‌లో కాల్పులు జరిగిన సంఘటననే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అన్ని దేశాలు గుర్తు తెచ్చుకుంటున్నాయి. భారతదేశం కూడా సెక్యూరిటీ కారణంతోనే తమ జట్టును పాకిస్తాన్‌ను పంపేందుకు నిరాకరించింది.


ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్‌కి ఎలాంటి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతో ఆ దేశ ప్రభుత్వం భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. పాక్ మీడియా లెక్కల ప్రకారం 12 వేల మంది పోలీసు అధికారులు ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే స్టేడియంలు వద్ద సెక్యూరిటీగా ఉన్నారు. ముఖ్యంగా లాహోర్, రావల్పిండిలో అడుగడుగునా గస్తీ నిర్వహిస్తున్నారు. 18 మంది సీనియర్ ఆఫీసర్లు, 54 మంది డీఎస్పీ రేంజ్ అధికారులు, 135 మంది ఇన్‌స్పెక్టర్లు, 1200 సబ్ ఇన్‌స్పెక్టర్లు, 10,556 మంది కానిస్టేబుళ్లు, 200 మందికి పైగా మహిళా పోలీసులను బందోబస్తుగా ప్రభుత్వం నియమించింది.


సెక్యూరిటీతో పాటు ఎయిర్ లైన్స్‌ని యాక్టివ్ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. కేవలం మ్యాచ్‌లు తిలకించే ప్రేక్షకుల కోసం ఏడు ఛార్టర్ ఫ్లయిట్స్‌ని ఏర్పాటు చేశారట. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, రావల్పిండికి ఫ్లట్ సర్వీసులు ఎక్కువగా ఉండేటట్లు చూసుకుంటున్నారు. భారత్ ఆడే మ్యాచ్‌లు మినహా మిగతా ఏడు దేశాల అభిమానులు పాకిస్తాన్‌కి వచ్చే అవకాశం ఉంది. దాంతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కూడా యాక్టివ్ అయింది.


ఏ దేశానికి తీసిపోని విధంగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చెబుతోంది. అందులో భాగంగానే స్టేడియాల రెనోవేషన్‌ను కూడా సవాల్‌గా తీసుకుని పూర్తి చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి సమస్య తలెత్తకుండా చాలా జాగ్రత్త పడుతోంది.


క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడే పాకిస్తాన్ అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే, వారిలో ఒకటే బాధ.. విరాట్ కోహ్లి తమ దేశానికి రావడం లేదు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి పాకిస్తాన్‌లో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. విరాట్‌ను తమ దేశంలో జరిగే ఈ అతిపెద్ద పండగలో చూడలేకపోతున్నామని చాలా మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa