ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన ఈవీ దిగ్గజం టెస్లా.. త్వరలోనే భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే భారత్లో నియామక ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. షోరూంల ఏర్పాటు కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల వ్యాఖ్యలు చేశారు. భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలనే ఎలాన్ మస్క్ ప్రణాళిక ‘అన్యాయమే’ అని ఆయన వ్యాఖ్యానించారు. మస్క్ పక్కన ఉండగానే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇరువురూ కలిసి ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్లోకి టెస్లా ఎంట్రీపై ట్రంప్ మాట్లాడారు.
‘‘ఈ ప్రపంచంలోని ప్రతి దేశం అమెరికాను వినియోగించుకోడానికి ప్రయత్నిస్తోంది. భారీ సుంకాలతో మానుంచి లబ్ధి పొందాలని చూస్తుంటారు.. దీంతో ఎలాన్ మస్క్ తన కార్లను విక్రయించడం కష్టంగా మారుతోంది. ఇందుకు ఉదాహరణ భారతే..! ఇప్పుడు ఆయన (మస్క్) భారత్లో ప్లాంట్ ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన వరకు అది మంచిదే కావొచ్చు.. కానీ, అమెరికా పరంగా ఇది చాలా అన్యాయమైన నిర్ణయమే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో గతవారం జరిగిన భేటీని ట్రంప్ గుర్తుచేసుకున్నారు. ఇరువురి భేటీలో ఎలక్ట్రిక్ కార్లపై అధిక సుంకాల విషయాన్ని మోదీతో తాను ప్రస్తావించినట్లు తెలిపారు. సుంకాల సమస్యను పరిష్కరించుకోవడం సహా వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కోసం భారత్, అమెరికాలు కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు.
ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా చీఫ్తో మోదీ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ సంస్థ భారత్లో నియామకాలు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే, విద్యుత్ వాహనాలు తయారీ ప్లాంట్ ఏర్పాటుపై టెస్లా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. భారత్లోని పలు నగరాల్లో షోరూమ్లను తెరిచేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం తొలి రెండు షోరూమ్ల ఏర్పాటుకు దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి నగరాలను ఎంపిక చేసినట్లు నివేదిక తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa