ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనే ఆసక్తికర మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరు జట్ల ప్లేయర్లు వేదికగా వద్దకు చేరుకుని.. ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఇక ఈ టోర్నీలో బంగ్లాదేశ్ను ఓడించిన భారత్.. ఈ మ్యాచులో గెలిస్తే.. సెమీస్ స్థానాన్ని ఖరారు చేసుకోనుంది. తొలి మ్యాచులో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన ఆతిథ్య పాకిస్థాన్.. ఈ మ్యాచులోనూ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. బలాబలాల పరంగా భారత జట్టు బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్.. ఇండో-పాక్ మ్యాచ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మెరుగైన ప్రదర్శన చేస్తాడని పేర్కొన్నాడు. సెంచరీ కూడా చేసే అవకాశం ఉందని జోస్యం చెప్పాడు.
"రోహిత్ శర్మ డేంజరస్ ప్లేయర్.. అతడు కాస్త సంయమనం పాటిస్తే.. అతడిని ఆపడం ఎవరివల్లా కాదు. ఈజీగా సెంచరీ చేసేస్తాడు. రోహిత్ శర్మ 60 బంతుల్లోనే శతక్కొట్టేస్తాడు. అతడి ఆటే అలాంటిది. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే చాలు.. పరుగుల వరదే. కేవలం ఫోర్లు మాత్రమే కాదు.. సిక్స్లతో అవలీలగా పరుగులు రాబడతాడు. షార్ట్ పిచ్ బాల్స్ ఆడటంతో రోహిత్ను మించిన వారు లేరు. 150 కి.మీ వేగంతో వచ్చే బంతినైనా.. ఈజీగా బౌండరీగా మారుస్తాడు. అతడు ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించే ప్లేయర్" అని యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు.
కాగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి మ్యాచ్లో గెలిచి భారత్.. ఆత్మవిశ్వాసంతో ఉండగా.. పాకిస్థాన్ ఒత్తిడిలో కూరుకుపోయింది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa