ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈపీఎస్ 95 పెన్షనర్లకు .. పెన్షన్ పెంపుపై కేంద్రం సానుకూల స్పందన

business |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 10:49 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చందాదారులకు ఈపీఎస్ 95 కింద చెల్లించే కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలనే డిమాండ్లు కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్నాయి. వీటిపై కేంద్రం నుంచి తాజాగా సానుకూల స్పందన వచ్చింది. కనీస పెన్షన్ సహా పలు డిమాండ్ల సాధాన కోసం 2014 నుంచి పోరాటం చేస్తున్న ఈపీఎస్ 95 ఆందోళన కమిటీ శనివారం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని తెలిపింది. ఇటీవల కేంద్రం కార్మిక శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయతో జరిపిన చర్చల్లో పెన్షన్ పెంపు సహా పలు డిమాండ్లపై సానుకూల స్పందన వచ్చినట్లు పెన్షనర్ల సంఘం వెల్లడించింది. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే దేశంలోని సుమారు 78 లక్షల మందికి ప్రయోజనం కలగనుందని ఆందోళన కమిటీ తెలిపింది.


ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 95 కింద చెల్లించే కనీస పెన్షన్‌ను రూ.7 వేలకు పెంచాలని ఆందోళన కమిటీ ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తోంది. చివరగా 2014లో కనీస పెన్షన్ రూ.1000కి పెంచారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేయలేదు. దానిని రూ.7 వేలపైకి పెంచాలని దీంతో పాటుగా పెన్షనర్లు, వారి జీవిత భాగస్వామికి ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలనే డిమాండ్లు సైతం ఉన్నాయి. అలాగే అధిక పెన్షన్‌కు సంబంధించిన దరఖాస్తుల్లోని తప్పులను సవరించాలని పెన్షనర్లు కోరుతున్నారు.


అయితే ఈ విషయంపై ఫిబ్రవరి 1, 2025 రోజున ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2025-26లోనే ప్రకటన ఉంటుందని పెన్షనర్లు భావించారు. కానీ ఎలాంటి ప్రకటనా రాకపోవడంతో పెన్షనర్లు ఒకింత నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర కార్మిక శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలతో ఫిబ్రవరి 21, 2025 రోజున పెన్షన్ ఆందోళన కమిటీ భేటీ అయింది. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ హామీ ఇచ్చినట్లు ఆందోళన కమిటీ జాతీయ అధ్యక్షుడు అశోక్ రౌత్ వెల్లడించారు.


మరోవైపు.. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్  వడ్డీపై నిర్ణయం తీసుకునేందుకు ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీలు ఫిబ్రవరి 28, 2025 రోజున సమావేశం అవుతున్నారు. పీఎఫ్ ఖాతా వడ్డీతో పాటు ఈపీఎస్- 95 పెన్షన్ పెంపుపై సానుకూల నిర్ణయం ఉంటుందని ఆందోళన కమిటీ చెబుతోంది. మరి చూడాలి ఆరోజు ఎలాంటి ప్రకటన చేయనున్నారో.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa