ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోస్టాఫీసులో రూ.520 చెల్లిస్తే.. రూ.10 లక్షల బీమా

business |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 10:55 PM

భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఎంత అవసరమో, అనుకోని సంఘటన ఎదురైనప్పుటు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే హెల్త్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సైతం అంతే అవసరం. అనుకోనిది జరిగి ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రమాద బీమా అండగా నిలుస్తుంది. అయితే, చాలా మంది ఈ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఇష్టపడరు. ప్రీమియం ఎక్కువగా ఉంటుందని వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారందరికీ పోస్టల్ శాఖ అదిరే ఆఫర్ అందిస్తోంది. చాలా తక్కువ ప్రీమియంతోనే బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల భాగస్వామ్యంతో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తోంది.


ఏడాదికి రూ.520తో రూ.10 లక్షల బీమా


పోస్టాఫీసు అందిస్తున్న యాక్సిడెంటల్ ఇన్సూరెన్సులో ఇది అద్భుతమైన స్కీమ్ అని చెప్పవచ్చు. కేవలం రోజుకు రూపాయిన్నర చెల్లించి ఏకంగా రూ.10 లక్షల కవరేజీ తీసుకోవచ్చు. టాటా ఏఐజీ (Tata AIG)తో కలిసి పోస్టల్ శాఖ ఈ బీమా కల్పిస్తోంది. ఏడాదికి రూ.520 చెల్లిస్తే సరిపోతుంది. పాలసీదారుడు ప్రమాదంలో మృతి చెందినట్లయితే నామినీకి రూ.10 లక్షలు ఇస్తారు. లేదా శాశ్వత అంగ వైకల్యం, పాక్షిక వైకల్యం ఏర్పడిన సందర్భంలోనూ రూ.10 లక్షలు ఇస్తారు. ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరిన తర్వాత వైద్య ఖర్చులకు రూ. 1లక్ష ఇస్తారు. పాలసీదారు మరణిస్తే అలాగే 21 సంవత్సరాలలోపు ఇద్దరు పిల్లల చదువు కోసం రూ. 1 లక్ష ఇస్తారు. దీంతో పాటు ఒకటి, రెండు రోజుల చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఖర్చు చెల్లిస్తారు. గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు వస్తాయి.


రూ.755తో రూ.15 లక్షలు..


నిపా బూపా హెల్త్ ఇన్సూరెన్స్‌ కంపెనీ భాగస్వామ్యంతో మరో ప్రమాద బీమా అందిస్తోంది. ఏడాదికి రూ. 755 చెల్లిస్తే చాలు. పాలసీదారు ప్రమాదంలో మృతి చెందితే నామినీకి రూ.15 లక్షలు ఇస్తారు. శాశ్వత వైకల్యంతో పాటు పాక్షిక వైకల్యానికి సైతం రూ.15 లక్షలు ఇస్తారు. వైద్య ఖర్చులకు లక్ష రూపాయలు, ఆసుపత్రిలో సాధారణ వైద్యం కోసం రోజుకు రూ.1000 ఇస్తారు. ఐసీయూలో చేరితే రోజుకు రూ. 2 వేలు చెల్లిస్తారు. ఒక వేళ కాలు లేదా చేయి విరిగినట్లియితే రూ.25 వేల వరకు చెల్లిస్తారు. పిల్లల ఉన్నత చదువు, పెళ్లి కోసం రూ.1 లక్ష వరకు అందిస్తారు.


ఈ బీమా పాలసీలు తీసుకునేందుకు 18 నుంచి 65 ఏళ్ల వయసులోపు వారు అర్హులు. ఈ పాలసీలు తీసుకునేందుకు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకులో ఖాతా ఉండాలి. అయితే రూ. 100 తోనే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. పోస్ట్ పేమెంట్ బ్యాంకు బ్రాంచుకు వెళ్లి ప్రమాద బీమా పాలసీ కొనుగోలు చేయవచ్చు. ఆటో డెబిట్ సౌకర్యంతో ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ రెన్యువల్ అయ్యేలో ఆప్షన్ ఎంచుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com