ఉగాండాలో హత్య, కిడ్నాప్ ఆరోపణలతో నిర్బంధానికి గురై విడుదలైన భారత సంతతికి చెందిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర ఓస్వాల్ () జైలు అనుభవం గురించి వెల్లడించారు. ఆ భయానక అనుభవాన్ని గుర్తుచేసుకున్న వసుంధర.. అత్యంత దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్టు పేర్కొంది. ఎలాంటి వారెంట్ లెకుండా నిర్బంధించారని వాపోయిన ఆమె.. ఒకానొక దశలో వాష్రూమ్ కూడా వెళ్లడానికి అనుమతించలేదని తెలిపారు. బలవంతంగా తనను ఓ పోలీస్ అధికారి లాక్కెళ్లి వ్యానులోకి పడేశాడని వసుంధర వాపోయారు.
తమ ఇంటిలో పనిచేసే ముకేశ్ అనే వ్యక్తి అదృశ్యమవ్వడంతో గతేడాది అక్టోబరు 1న ఉగాండా పోలీసులు వసుంధర ఓస్వాల్ను కిడ్నాప్, హత్య ఆరోపణల కింద అరెస్ట్ చేశారు. అదృశ్యమైన వ్యక్తి టాంజానియాలో కనిపించినా..న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినా.... తనను విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేశారని వసుంధర పేర్కొన్నారు.
‘‘అక్టోబరు 1న ఎలాంటి వారెంట్ లేకుండా పోలీసులు మా ఇంట్లోకి ప్రవేశించారు.. ప్రశ్నిస్తే ఇది ఐరోపా కాదు.. ఉగాండా అని సమాధానం ఇచ్చారు. ఇంటర్పోల్ అధికారిని కలవాలంటూ బలవంతంగా ఓ పోలీసు అధికారి లాక్కెళ్లి వ్యాన్లో వేశాడు... పాస్పోర్టు తీసుకున్నారు. పోలీస్ బాండ్ కోసం 30 వేల డాలర్లు కట్టాలని చెప్పారు.. ఆ మొత్తాన్ని చెల్లించినా నాకు ఎలాంటి బాండ్ ఇవ్వలేదు.. మూడు రోజులు నిర్బంధం అనంతరం నకసోంగోలా జైలుకు తరలించారు. రెండు వారాలకుపైగా అక్కడ నరకం చూపించారు.. నా ప్రాథమిక హక్కులకు తీవ్రంగా భంగం కలిగించారు.. నీళ్లు, భోజనం ఇవ్వలేదు. స్నానం చేయనివ్వలేదు. కనీసం నన్ను వాష్రూమ్కు కూడా వెళ్లనివ్వలేదు.. లంచం ఇచ్చాకే ఆహారం, నీరు ఇచ్చేవారు.’’ అని వసుంధర తెలిపారు. తనపై నమోదు చేసిన కేసును డిసెంబరు 21న కోర్టు కొట్టివేసిందని వసుంధర తెలిపారు.
ఉగాండాలో తమ కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థల కార్యకలాపాల పరిశీలించేందుకు వెళ్లిన వసుంధరను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఆమె సోదరి రిధి ఓస్వాల్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. కిడ్నాప్, హత్య అభియోగాల పేరుతో తమ సోదరిని అక్రమంగా నిర్బంధించారని, అత్యంత దుర్బరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని రిధి ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పులతో నిండిపోయిన ఒక గదిలో 90 గంటల పాటు బలవంతంగా ఉంచారని, ఐదురోజుల పాటు స్నానానికి, దుస్తులు మార్చుకోవడానికి కూడా అనుమతించలేదని ఇన్స్టాగ్రామ్ పోస్టు చేశారు. గతంలో ఓస్వాల్ కుటుంబం వద్ద పనిచేసిన రాజస్థాన్కు చెందిన ముకేశ్ మేనరియా అనే మాజీ ఉద్యోగి కారణంగానే ఆమెకు ఈ పరిస్థితి దాపురించింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa